Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: కేంద్ర ప్రభుత్వపు ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సీఈఏ) హైదరాబాద్కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అసోసియేట్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్ ఎంపికయ్యారు. జూన్లో సీఈఏగా పదవి నుంచి తప్పుకున్న అరవింద్ సుబ్రహ్మణియన్ స్థానంలో కొత్తగా కృష్ణమూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పదవిలో కృష్ణమూర్తి మూడేండ్ల పాటు సేవలందించనున్నారు. ఐఐటీ కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన కృష్ణమూర్తి అనంతరం ఐఐఎం కల్కత్తాలో టాప్ ర్యాంకర్గా నిలిచారు. అనంతరం షికాగో-బూత్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. అనంతరం ఆయన ఐఎస్బీలో ఆర్థిక విభాగంలో అసోసియేట్ ఫ్రొపెసర్గా సేవలందిస్తున్నారు. బ్యాంకింగ్, కార్పొరేట్ గవర్నెన్స్, ఎకనామిక్ పాలసీ తదితర అంశాల్లో కృష్ణమూర్తి నిష్ణాతులు. తెలుగుతో పాటుగా ఇంగ్లీషు, బెంగాలీ, హిందీ, సంస్కృతం, తమిళం భాషల్లో కృష్ణమూర్తికి మంచి ప్రావిణ్యం ఉంది. ఆర్థిక అంశాలపై ఆయన రచించిన వివిధ ఆర్టికల్ జాతీయ, అంతర్జాతీయ జర్నల్లలో ప్రచురితం అయ్యాయి. సెబీకి చెందిన కార్పొరేట్ గవర్నెన్స్ కమిటీలోను, బ్యాంకుల గవర్నెన్స్పై ఆర్బీఐ వేసిన నిపుణుల కమిటీలో ఆయన సభ్యులుగా ఉన్నారు. బంధన్ బ్యాంక్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్, ఆర్బీఐ అకాడమీలతో పాటు వివిధ సంస్థల బోర్డుల్లో ఆయన సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్కు చెందిన కృష్ణమూర్తి సీఈఏగా నియమితులవ్వడం పట్ల స్థానిక మేథావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.