Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్కు ఎన్ఆర్ఐలు పంపిస్తున్న సొమ్మిది..
- ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే అగ్రస్థానం
- అభివృద్ధి చెందిన దేశాల్లో అనుకూలతే కారణం..
- రెమిటెన్స్ల్లో దక్షిణాసియా ప్రాంతానిదే రికార్డు
వాషింగ్టన్: ప్రవాస భారతీయులు మాతృ దేశానికి పంపుతున్న సొమ్ము మొత్తం అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ప్రవాస భారతీయులు 8000 బిలియన్ డాలర్లను (ఇండియా కరెన్సీలో దాదాపు రూ.5,60,000 కోట్లు) స్వదేశానికి పంపిస్తున్నారని ప్రపంచ బ్యాంక్ ఒక నివేదికలో తెలిపింది. ప్రపంచం మొత్తంలోని ప్రవాసులు తమ మాతృదేశాలకు పంపుతున్న సొమ్ముతో పోలిస్తే ఇదే అత్యధికమని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. భారత్ తర్వాత స్థానంలో 67బిలియన్ డాలర్లతో (దాదాపు రూ.4,70,000 కోట్లు) చైనా, 34 బిలియన్ డాలర్లతో (దాదా పు రూ.2,38,000 కోట్లు) ఫిలిప్పీన్స్, 26 బిలియన్ డాలర్లతో (రూ.1,82,000 కోట్లు) ఈజిప్ట్లు నిలిచాయి. 'మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్' పేరుతో రూపొందించిన తాజా సంచికలో 'అభివృద్ధి చెందుతున్న దేశాలకు వస్తున్న ప్రవాస నిధులను ప్రపంచ బ్యాంక్ లెక్కగట్టింది. 2018లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రవాసులు పంపుతున్న మొత్తం దాదాపు 10.8 శాతం మేర వృద్ధి చెంది 528 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ అంచనా కట్టింది. 2017లో ఎన్నారైల నుంచి అభివృద్ధి చెందిన దేశాలకు వచ్చిన సోమ్ము వృద్ధి 7.8 శాతం దరిదాపుల్లోనే ఉన్నట్టుగా ఈ నివేదిక తెలిపింది. గత ఏడాది ప్రవాసుల నుంచి భారత్కు వచ్చిన మొత్తం 62.7 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టుగా ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఇది భారత జీడీపీలో దాదాపు 2.7 శాతానికి సమానమని లెక్కతేల్చింది. అంతకు ముందు 2016లో ఇది 65.3 బిలియన్ డాలర్లుగా నమోదైందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇతర ప్రాంతాల కంటే కూడా దక్షిణాసియా ప్రాంతానికి ఆయా దేశాలకు చెందిన ప్రవాసులు పంపుతున్న మొత్తంలో గణనీయమైన వృద్ధి నమోదు అవుతున్నట్టుగా ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. ఈ ప్రాంతంలో ప్రవాసులు పంపుతున్న మొత్తం 13.5 శాతం వృద్ధితో 132 బిలియన్ డాలర్లకు చేరువకావొచ్చని నివేదిక తెలిపింది. అంతకు ముందు 2017లో ఈ వృద్ధి 5,7 శాతం దరిదాపుల్లోనే ఉన్నట్టుగా వెల్లడించింది.
అమెరికా.. గల్ఫ్ నుంచే అత్యధికం
దక్షిణాసియాకు చెందిన ప్రవాసులు స్వదేశాలకు అధిక మొత్తంలో తమ సొమ్మును పంపుతుండడానికి ప్రధాన కారణాలను ఈ నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు మెరుగ్గా రాణిస్తుండడం, ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంతో పాటు, ముడి చమురు ధరలు పెరగడం వల్ల యూఏఈ వంటి గల్ఫ్దేశాల నుంచి రెమిట్టెన్స్లు పెరిగాయని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. భారత్కు వస్తున్న ప్రవాస సొమ్ములో ఈ రెండు ప్రాంతాల నుంచే అత్యధికంగా ఉంటున్నట్టుగా ఈ నివేదిక తెలిపింది. మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్థాన్లకు ప్రవాసులు పంపుతున్న మొత్తాల్లో కూడా గణీయమైన పెరుగుదల కనిపించింది.
2019లో తగ్గవచ్చు..
అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా వచ్చే ఏడాది (2019లో) దక్షిణాసియాలోని ప్రవాసులు స్వదేశాలకు పంపే సొ మ్ములో 4.3శాతం మాత్రమే వృద్ధి నమోదు కావొచ్చని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. వచ్చే ఏడాది మధ్య స్థాయి, అల్పదాయ దేశాలకు ప్రవాసుల నుంచి వచ్చే సొమ్ము 549 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని.. ప్రపంచం మొత్తం మీద ఈ మొత్తం 715 బిలియన్ డాలర్లకు మించకపోవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా కట్టింది.