Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గాలి నాణ్యతను దెబ్బతీసే విధంగా పనులు చేపడుతూ జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) ఉత్తర్వులను ఉల్లంఘించిన 18 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడా పరిధిలోని గౌతమ బుద్ద నగర్ జిల్లా పత్వారీ ప్రాంతంలో ఓ బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది. దీనికోసం తీసుకొచ్చిన ఇసుక, ఇతర సామాగ్రి నుంచి దుమ్ము లేవకుండా ఉండేందుకు వాటిపైన కవర్లు కప్పి ఉంచలేదు. ఇది గమనించిన అధికారులు నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. దీనిపై జిల్లా మెజిస్ట్రేట్ బ్రజేశ్ నరైన్ సింగ్ మాట్లాడుతూ.. ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు దారుణంగా పడిపోతున్న కారణంగా చట్టాలను కచ్చితంగా పాటించాలన్నారు. ఈ ఏడాది దీపావళిన ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించిన కారణంగా 61 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.