Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సోమవారం మార్కెట్లను రెండు శాతం మేర కుప్పకూలేలా చేశాయి. ఇప్పటికే తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయ్యాయి. వీటి ఫలితాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. ముఖ్యంగా బీజేపీకి పట్టున్న రాజస్థాన్, చత్తీస్ఘడ్, మధ్య ప్రదేశ్లో తిరిగి అధికారంపై నెలకొన్న అనుమానాలు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఈ పరిణామాలు వచ్చే మేలో జరిగే సాధారణ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడనుందన్న విశ్లేషణలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలోనే వారం తొలి రోజునే మదుపర్లు భారీగా అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో బిఎస్ఇ సెన్సెక్స్ 713.53 పాయింట్లు పతనమై 34,959.72కు దిగజారింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 205.25 పాయింట్ల లేదా 1.92 శాతం నష్టపోయి 10,475.45 వద్ద ముగిసింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ 54 పైసలు క్షీణించి 71.35కు దిగజారింది. గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెరగడం, ఆసియన్ మార్కెట్లు ఒత్తిడికి గురి కావడం తదితర పరిణామాలు కూడా సెన్సెక్స్, నిఫ్టీలపై ప్రతికూల ప్రభావాన్ని పెంచాయి.