Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ పెెద్దబ్యాంక్ కొత్త అధినేతగా శక్తికాంత్ నియామకం
- 1980 బ్యాచ్ ఐఏఎస్కు ఆర్బీఐ బాధ్యతలు
- ప్రధాని వీర విధేయుడైనందుకే ఉన్నతపదవి!
- మూడేండ్ల పదవీ కాలంతో పూర్తి బాధ్యతలు.
- నోట్లరద్దు సమయంలో విధేయతకు నజరానా!
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కొత్త గవర్నర్గా ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి శక్తికాంత్ దాస్ను నియమిస్తున్నట్టుగా ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఆయన మూడేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. వివాదాల నేపథ్యంలో సర్కారు నుంచి ఒత్తిడి పెరిగి.. తన పదవికి రాజీనామా చేసిన ఉర్జిత్ పటేల్ స్థానంలో శక్తికాంత్ దాస్ ఆర్బీఐ 25వ గవర్నర్గా భాద్యతలు చేపట్టనున్నారు. 1980 ఐఏఎస్ బ్యాచ్కు (తమిళనాడు క్యాడర్) చెందిన శక్తికాంత్ 2015-17 మధ్య కాలంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పని చేశారు. ఈ సమయంలోనే ఆయన ఆర్బీఐ అధినాయకత్వంతో చాలా దగ్గరగా పని చేశారు. ప్రస్తుతం ఆయన 15వ ఆర్థిక సంఘం సభ్యులుగాను, జీ-20 సమావేశాలకు భారత ప్రభుత్వపు అధికార ప్రతినిధిగాను వ్యవహరిస్తున్నారు. మోడీ సర్కారు తొలత శక్తికాంత్ను ఆర్థిక శాఖలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అధినేత బాధ్యతలను అప్పగించింది.. ఆ తరువాత ఆయన మోడీ సర్కారు పట్ల చూపుతున్న విధేయతను గుర్తించిన సర్కారు దాస్కు కీలకమైన ఆర్థిక వ్యవహారా కార్యదర్శి పదవిని కూడా అప్పగించింది. 2016లో మోడీ సర్కారు అనాలోచితంగా అమలులోకి తెచ్చిన నోట్లరద్దు ప్రక్రియను స్వయంగా దగ్గరుండి మరీ అమలు చేస్తూ.. లోటుపాట్లను స్వయంగా సమీక్షించిన వ్యక్తిగా శక్తికాంత్కు మోడీ సర్కారులో మంచి పేరుంది. ఆయన అప్పట్లో మీడియా ముందు నోట్ల రద్దును సమర్థిస్తూ రోజూ మీడియా ముందుకు వచ్చి ప్రకటనలు చేసేవారు. ఎన్ని విమర్శలు వచ్చినా మోడీ సర్కారు నిర్ణయాన్ని వీలైనంత గరిష్ట స్థాయిలో వెనుకేసుకురావడం వంటి చర్యలతో దాస్ మోడీ మనసులో చెరగని ముద్రవేసుకున్నారు. అయితే ఈ ప్రయత్నంలో శక్తికాంత్ దాస్ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఆ తరువాత దేశ వ్యాప్తంగా వస్తుసేవల పన్నును (జీఎస్టీ) అమలులోకి తెచ్చే విషయంలో కూడా మోడీ నిర్ణయం మేరకు దూకుడుగా వ్యవహరించి అధికారిగా శక్తికాంత్ దాస్కు సర్కారు వద్ద మంచి పరపతి ఉంది. ఇప్పుడు ఆయనకు ఆర్బీఐ పగ్గాలను అప్పగించే విషయంలో ఈ అంశాలు ఆయనకు బాగా కలిసి వచ్చినట్టుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంలోని బడ్జెట్ విభాగంలో పని చేసిన శక్తికాంత్కు మోడీ సర్కారుతో పాటు, యూపీఏ హయాంలోనూ పని చేసిన అనుభవం ఉంది.
యద్ధప్రాతిపదికన నియామకం..
ప్రభుత్వంతో ఏర్పడిన విభేదాల కారణంగా అకస్మికంగా ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి ఉర్జిత్ వ్యక్తిగత వైదలగడంతో మోడీ సర్కారు డిఫెన్స్లో పడింది. ఉర్జిత్ రాజీనామా తమకు చెడ్డపేరు తెస్తుందని భావించిన మోడీ టీమ్ సోమవారం సాయంత్రం నుంచే నష్ట నివారణ చర్యలను మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఉర్జిత్ వారసుడి వేటను మొదలు పెట్టింది. కొత్త గవర్నర్ నియామకం కోసం సోమవారం అర్థరాత్రి దాటాక కూడా మోడీ కసరత్తు చేసినట్టు సమాచారం.ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం తమ టీమ్లో ఆర్థిక వ్యవహారాలపై పట్టున్న వ్యక్తిగా వ్యవహరించే శక్తికాంత్ దాస్కు ఆర్బీఐ పగ్గాలను అప్పగించాలని నిర్ణయించింది. ఉర్జిత్ వైదొలిగి ముచ్చటగా 30 గంటలు కూడా గడవకముందే ప్రభుత్వం ఆయన వారసుడిని ప్రకటించేసింది. ఇది ప్రభుత్వపు మరో దుందుడుకు చర్య అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఉండడం.. వచ్చే శుక్రవారం ఆర్బీఐ బోర్డు సమావేశం నేపథ్యంలో కొత్త ఆర్బీఐ గవర్నర్ ఎంపిక విషయంలో ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవంగా నిబంధనల ప్రకారమైతే ఆర్బీఐ గవర్నర్ వంటి ఉన్నత పదవికి నియామకం చేపట్టే ముందు ప్రభుత్వం 'ఆర్థిక రంగ నియంత్రణల, నియామకపు సెర్చ్ కమిటీ'ని (ఎఫ్ఎస్ఆర్ఏఎస్సీ) సంప్రదించి అర్హత కలిగిన కొందరు వ్యక్తుల పేర్లను సూచించాల్సిందిగా కోరాల్సి ఉంటుంది. ఈ కమిటీ సమర్థలను వెతిక పలువురి పేర్లతో సర్కారుకు జాబితాను అందిస్తుంది. ఈ జాబితాలో సమర్థులను ఎంచుకొని ప్రభుత్వం కీలక పదవిని అప్పగించాల్సి ఉంటుంది. కానీ.. శక్తికాంత్ దాస్ నియామకం విషయంలో ఈ ప్రక్రియను మోడీ సర్కారు పూర్తిగా పక్కనబెట్టినట్టుగా తెలుస్తోంది. తమ స్వీయ నిర్ణయం మేరకే సర్కారు ఈ శక్తికాంత్ దాస్ నియామకాన్ని వెల్లడించినట్టుగా సమాచారం. పార్లమెంట్ సమావేశ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఉర్జిత్ రాజీమానాపై ప్రభుత్వాన్ని దయ్యబట్టే అవకాశం ఉందని గమనించిన సర్కారు ఆగమేఘాల మీద ఆర్బీఐకి కొత్త గవర్నర్ను నియమించినట్టుగా సమాచారం.
అనుకున్నది చేసుకుపోయే నైజం..
తాను సరైంది అనుకున్న మార్గంలో దూకుడుగా ముందుకు వెళ్లడం శక్తికాంత్ దాస్కు ఉన్న బలం. తమిళనాడులో ప్రత్యేక ఆర్థిక మండళ్లు, మేటి పారిశ్రామిక విధానాన్ని తీసుకురావడంలో ఆయన వ్యవహరించిన తీరు అప్పట్లో వివాదాస్పదమైంది. గతంలో తమిళనాడులోని ప్రభుత్వ భూమిని ఐటీ కంపెనీలకు ఎలాంటి బిడింగ్ ప్రక్రియ లేకుండానే ఉచితంగా కేటాయింపులు జరపడం ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది.. అయినా శక్తికాంత్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగారు. జీఎస్టీ అమలు విషయంలోనూ దాస్ ఇదే తరహా వ్యవహారశైలిన కనబరిచారు. సర్కారుకు అనుకూలంగా రాష్ట్రాల ఆర్థిక మంత్రులను ఒప్పిస్తూ ముసాయిదా జీఎస్టీ బిల్లును ఆగమేఘాల మీద తీసుకురావడంలో కూడా దాస్ తనదైన దూకుడును ప్రదర్శించారు. దీంతో జీఎస్టీ అమలులోకి వచ్చి ఏడాది కావొస్తున్నా వస్తుసేవల పన్ను విధానం దేశంలో ఇంకా కుదురుకోనేలేదు. ఎన్ని అవాంతారాలు ఎదురైన ప్రభుత్వ నిర్ణయాల్ని తూచాతప్పకుండా అమలు చేయడంతో పాటు.. వ్యతిరేకంగా ఉన్న వారిపై విరుచుకుపడే దాస్ ధోరణే ప్రధానంగా ఆయనకు ఆర్బీఐ పగ్గాలు వచ్చేలా చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఆర్బీఐలో అధికారులు, డిప్యూటీ గవర్నర్లు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పంతాన్ని నెగ్గించుకొనే వ్యూహంలో భాగంగానే దాస్ను మోడీ సర్కారు రంగంలోకి దించినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రేటింగ్ ఏజెన్సీలపై రెచ్చిపోయాయి..
గత ఏడాది భారత ఆర్థిక వ్యవస్థలోని లోటుపాట్లను వెలుగులోకి తెస్తూ వివిధ రేటింగ్ సంస్థలు భారత క్రెడిట్ రేటింగ్లను స్వల్పంగా సవరించాయి. అయితే మోడీ సర్కారుకు వీర విధేయుడిగా ఉన్న శక్తికాంత్ అప్పట్లో దీనిపై మండిపడ్డారు. ఏకంగా రేటింగ్ను నిర్ణయించేందుకు గాను ఆయా సంస్థలు పాటిస్తున్న విధానాల్ని ఆయన బాహాటంగానే విమర్శించారు. భారత్కు మెరగైన రేటింగ్ను ఇవ్వాలంటూ మీడియాలో రచ్చచేసి అంతర్జాతీయ మీడియాలో వివాదాస్పద వ్యక్తిగా చెడ్డపేరు తెచ్చుకున్నారు.