Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో పరుగులు పెట్టాయి. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కొత్త బాస్గా ప్రభుత్వానికి అనుకులుడిగా పేరున్న శక్తికాంత్ దాస్ను సర్కారు నియమించడం.. ఆయన బుధవారం ఉదయమే బాధ్యతలు స్వీకరించడం మార్కెట్లకు కొత్త ఊపునిచ్చింది. ప్రభుత్వంతో కొత్త గవర్నర్ సత్సంబంధాలు కొనసాగిస్తారనే అంచనాల నడుమ.. ఆర్థిక రంగ షేర్లు మెరుగ్గా రాణించాయి. దాస్ నియామకం, అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో బీజేపీ ప్రతికూల ఫలితాలు మార్కెట్లను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ను మొదలుపెట్టింది. నిఫ్టీ కూడా దాదాపు 100 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఆర్థిక రంగ షేర్లు సహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనించాయి. చివరి గంటల్లో వెల్లువెత్తిన కొనుగోళ్ల అండతో మార్కెట్లు భారీ లాభాల దిశగా దూసుకెళ్లాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 629 పాయింట్లు ఎగబాకి 35,779 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 188 పాయింట్ల లాభంతో 10,738 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 71.90గా కొనసాగుతోంది. రెండు రోజుల్లో 800పాయింట్లకు పైగా ఎగిసింది. దీంతో 5 వారాల్లో ఒక రోజులో అతిపెద్ద లాభాలుగా నిలిచాయి. సెన్సెక్స్లోని అన్ని స్టాక్స్ లాభాల్లోనే దూసుకుపోవడం విశేషం. బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ 2.53%, బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2.46% మేర ఎగిశాయి. బీఎస్సీలో 1916 సంస్థల షేర్లు లాభాల్లో నడవగా.. 647 స్టాక్స్ నష్టాల బాట పట్టాయి. 140 స్టాక్స్లో ఎలాంటి కదలిక కనిపించలేదు.