Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: గత మూడు సెషన్లుగా రాణించిన దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో మందగించాయి. శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కొద్దిసేపటికే కోలుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు, కీలక రంగాల్లో స్వల్ప కొనుగోళ్లు మార్కెట్ సెంటిమెంట్కు కలిసొచ్చాయి. మార్కెట్లు ఆద్యంతం ఫ్లాట్గా సాగాయి. శుక్రవారం ట్రేడింగ్ ఆరంభంలో 100 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత కొద్ది సేపటికి లాభాల బాట పట్టింది. అప్పటి నుంచి మార్కెట్లు ఫ్లాట్గానే కొనసాగుతూ స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 33.29 పాయింట్లు లాభపడి 35,962.93 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 13.90 పాయింట్లు లాభపడి 10,805.45 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.81 వద్ద కొనసాగింది. దీంతో వరుసగా నాలుగో రోజు దేశీయ సూచీలు లాభాలలో ముగిసినట్టయింది. ఎన్ఎస్ఈలో బీపీసీఎల్, యెస్బ్యాంక్, ఐవోసీ, కోల్ ఇండియా షేర్లు లాభపడగా.. హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ, టైటాన్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. రంగాల వారీగా విశ్లేషించి చూస్తే రియల్టీ రంగం 0.6 శాతం పుంజుకోగా.. ఫార్మా 0.6 శాతం క్షీణించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఎయిర్టెల్ దాదాపు 6 శాతం జంప్ చేసి రాణించింది. వారాంతంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం కనిపించింది.