Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాదాసీదాగా ఆర్బీఐ బోర్డు సమావేశం..
- ఆర్బీఐ పాలన, లిక్విడిటీలపై ప్రధాన చర్చ..
- ఉర్జిత్ సేవలను కొనియాడిన సభ్యులు..
- కీలకంగా వ్యవహరించిన విరాల్ ఆచార్య
ముంబయి: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) బోర్డు సమావేశం శుక్రవారం సాధారణ వాతావారణంలో జరిగింది. ప్రభుత్వానికి-ఆర్బీఐకి మధ్య విభేదాలు పెరిగి ఉర్జిత్ పటేల్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన నాలుగు రోజుల వ్యవధిలో సమావేశమైన బోర్డు పలు కీలక అంశాలలోకి వెళ్లకుండానే కేవలం రెండు, మూడు అంశాలపైనే చర్చ జరిపినట్టుగా తెలుస్తోంది. ఆర్బీఐ కొత్త గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో సమావేశమైన బోర్డు ముందు మాజీ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా అంశాన్ని పరిశీలించింది. ఆయన సేవలను కొనియాడుతూ తీర్మానం చేసింది. ఉర్జిత్ డిప్యూటీ గవర్నర్గా, గవర్నర్గా చేసిన సేవలు ఎనలేనివని సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంతో ఆర్బీఐకి ఇటీవల ఏర్పడిన విభేదాల నేపథ్యంలో అక్టోబరు 24, నవంబరు 19 తేదీల్లో జరిగిన బోర్డు సమావేశాలు గర్షణ వాతావరణం మధ్య.. వాడిగావేడిగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం నాడు జరిగిన సమావేశం అందుకు భిన్నంగా సాధారణ వాతావారణంలో సాగినట్టుగా ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. కేవలం రెండు మూడు అంశాలపైనే కీలకంగా చర్చ జరిగిందని ఆ వర్గాలు వెల్లడించాయి. గతంలో జరిగిన రెండు బోర్డు మీటింగ్లు దాదాపు ఎనిమిది గంటలకు పైగా జరిగితే.. శుక్రవారం నాటి సమావేశం కేవలం నాలుగు గంటలలోపే ముగిసిందని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. బోర్డు సమావేశంలో భాగంగా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శుభాష్ చంద్ర గార్గ్ ఆర్బీఐ పాలన వ్యవహారాల్లో సవరణలు, దేశంలోని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ సంస్థలు ఎదుర్కొంటున్న రుణ లభ్యత సమస్యలపై రెండు ప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఈ సమావేశానికి ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ గైర్హాజరవడం విశేషం.
ఆ రెండు అంశాలపైనే కీలక చర్చ..
శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన సమావేశం మొత్తం రెండు అంశాల చుట్టే జరిగినట్టుగా సమాచారం. ఆర్బీఐ పాలనా విధానంలో సంస్కరణలు, బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీల లిక్విడిటీ పరిస్థితలపైనే విస్తృతంగా చర్చ జరిగినట్టుగా అధికారులు తెలిపారు. ఆర్బీఐ పాలనా విధానాంశాలపై మరింత లోతుగా అధ్యయనం అవసరమని బోర్డు భావిస్తోందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక ప్రయివేటు బ్యాంక్పై ఆర్బీఐ విధించిన ప్రాంప్ట్ కరెక్టివ్ ఆక్షన్ (పీసీఏ) నిబంధనావళిని సవరించే విషయమై ఈ బోర్డు సమావేశంలో అసలు ఊసే రాకపోవడం విశేషం. ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఫైనాన్షియల్ సూపర్విజన్ బోర్డు వచ్చే సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ స్థితి, జాతీయ- అంతర్జాయంగా పొంచి ఉన్న సవాళ్లు, లిక్విడిటీకి సంబంధించిన వ్యవహారాలు రుణాల వితరణల, కరెన్సీ నిర్వహణ, ఆర్థిక అక్షరాస్యత అంశాలపై ప్రధానంగా బోర్డులో చర్చ జరిగినట్టుగా ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ బోర్డు తదుపరి సమావేశం ఫిబ్రవరిలో బడ్జెట్ సెషన్ కంటే ముందు నిర్వహించే అవకాశం ఉందని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి.
కీలకంగా వ్యవహరించిన విరాల్..
కేంద్రం-ఆర్బీఐ మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలను తొలిసారి బహిర్గతం చేసి వివాదాస్పదమైన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య శుక్రవారం నాటి బోర్డు సమావేశంలో చురుగ్గా వ్యవహరించారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై ఆయన అర్థవంతమైన చర్చను నిర్వహించినట్టుగా బోర్డు సమావేశంలో పాల్గొన్న వారు తెలిపారు. ఉర్జిత్ రాజీనామా తరువాత వివాదం మొత్తానికి కారకుడిగా చెప్పబడుతున్న విరాల్ ఆచార్య యాక్టివ్ కావడం ఆర్బీఐ వర్గాలతో సహా మీడియాను కూడా ఆశ్చర్యానికి లోను చేసింది. గతానుభవం రీత్యా దాస్ ఈ బోర్డు సమావేశాన్ని చాలా సాఫీగా నిర్వహించగలిగారని బోర్డు సభ్యులు ఒకరు తెలిపారు. కాగా.. ప్రభుత్వ అనుకూలిడిగా ఉన్న దాస్ ఆర్బీఐ గవర్నర్గా మారినందున ఇక వివిధ అంశాలపై విభిన్నంగా చర్చ జరిగేందుకు ఆస్కారమే లేకుండా పోయిందని ఆర్థిక విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కేవలం నాలుగు గంటల్లోనే బోర్డు సమావేశం ముగిసిందంటే బోర్డు మీటింగ్లో ఏమేరకు ఫలప్రదమైన చర్చ జరిగిందో ఊహించుకోవచ్చని వారు చెబుతున్నారు.