Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: స్వయం చలిత నగదు వితరణ యంత్రాలను (ఏటీఎం) మూసివేసే యోచనేది ప్రభుత్వ రంగ బ్యాంకులకు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. నియంత్రణ అంక్షల సవరణ, కొత్త నిబంధనల కారణంగా వచ్చే మార్చి నాటికి దేశంలో 2.38 లక్షల ఏటీఎంలలో సగం వరకు మూతపడనున్నాయంటూ వచ్చిన వార్తలపై సర్కారు శుక్రవారం వివరణనిచ్చింది. ఈ విషయమై ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా వివరణనిస్తూ సెప్టెంబరు ముగింపు నాటికి దేశంలో వాణిజ్య బ్యాంకులు, చిన్న బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎంలు కలుపుకొని మొత్తం 2.21 లక్షల ఏటీఎం యంత్రాలు వాడకంలో ఉన్నట్టుగా లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఏటీఎంలను మూసివేసే యోచనేది తమకు లేదని స్ఫష్టంగా తెలిపిన మంత్రి చెల్లింపులకు దేశంలో పలు ప్రత్యామ్నాయ విధానాలు అందుబాటులో ఉన్న విషయాన్ని వివరించారు. దేశీయ బ్యాంకింగ్ రంగానికి పెను సవాలుగా నిలుస్తున్న నిరర్థక ఆస్తుల సమస్య పరిష్కారానికి కేంద్రం ప్రత్యేకం దృష్టి సారిస్తున్నట్టుగా ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ చర్యల ఫలితంగానే గడిచిన నాలుగేండ్లలో రూ. 2.33 లక్షల కోట్ల విలువైన మొండిబకాయిలను ప్రభుత్వ రంగ బ్యాంకులు రికవరీ చేసుకున్నట్లు ఆర్థికశాఖ సహాయ మంత్రి శివ్ప్రతాప్ శుక్లా లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 2014-15 నుంచి 2017-18 ఆర్థిక సంవత్సరం వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 2,33,339 కోట్లను సొమ్మును రికవరీ చేసుకున్నట్లు శుక్లా తెలిపారు. ఇందులో రూ.32,693 కోట్లు సొమ్మును రాని బాకీల పద్దులో చేర్చినా రికవరీ చేసుకున్నట్లు వెల్లడించారు.