Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19 నెలల కనిష్టానికి పతనం
- నవంబర్లో పడకేసిన తయారీ రంగం
- సీిఎస్ఓ గణంకాల వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో కొనుగోలు డిమాండ్ పడిపోయి పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) నేల చూపులు చేస్తోంది. ముఖ్యంగా తయారీ రంగంలో స్తబ్దత వల్ల గతేడాది నవంబర్లో ఐఐపీ వృద్ధి 0.5 శాతానికి క్షీణించింది. దీంతో పారిశ్రామిక ఉత్పత్తి 19 నెలల కనిష్టానికి పడిపోయినట్టయ్యింది. శుక్రవారం కేంద్ర గణంకాల శాఖ (సీఎస్ఓ) నవంబర్ ఐఐపీ రిపోర్టును వెల్లడించింది. 2017 ఇదే నవంబర్లో ఏకంగా 8.5 శాతం వృద్ధి చోటు చేసుకుంది. ఇది వరకు జూన్ 2017లో అత్యల్పంగా 0.3 శాతం పెరుగుదల నమోదయ్యింది. ఆ తర్వాత ఈ స్థాయిలో క్రితం నవంబర్లోనే పడిపోయింది. 2018 అక్టోబర్ ఐఐపీ సూచీని 8.1 శాతం నుంచి 8.4 శాతానికి కేంద్ర గణంకాల శాఖ సవరించింది.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇంతక్రితం ఆర్ధిక సంవత్సరం ఇదే కాలంలో 3.2 శాతం పెరుగుదల నమోదయ్యింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం క్రితం నవంబర్లో కేవలం 0.4 శాతం వృద్ధితో సరిపెట్టుకుంది. 2017 ఇదే మాసంలో ఈ రంగం 10.4 శాతం వృద్ధిని సాధించింది. ఈ నెలలో గనుల రంగం 1.4 శాతం పెరగ్గా, 2018 నవంబర్లో 2.7 శాతం వృద్ధిని కనబర్చింది. విద్యుత్ రంగం ఉత్పత్తి 5.1 శాతానికి పెరిగింది. 2017 ఇదే మాసంలో విద్యుత్ రంగం 3.9 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ మాసంలో కాపిటల్ గూడ్స్ 3.7 శాతంగా ఉండగా, క్రితం నవంబర్లో 3.4 శాతానికి పడిపోయింది.
కన్సూమర్ డ్యూరెబుల్స్ సూచీ 2017 నవంబర్లో 3.1 శాతం వృద్ధిని సాధించగా, క్రితం నవంబర్లో ఏకంగా 0.9 శాతం పెరుగుదలతో సరిపెట్టుకుంది. ఇదే సమయంలో కన్సూమర్ నాన్ డ్యూరెబుల్స్ పెరుగుదల 0.6 శాతానికి క్షీణించింది. 2017 ఇదే మాసంలో ఈ రంగం ఉత్పత్తి ఏకంగా 23.7 శాతం వృద్ధిని సాధించింది. 2018 నవంబర్లో తయారీ రంగంలోని 23 పరిశ్రమల గ్రూపుల్లో 10 సూచీలు మాత్రమే సానుకూలంగా ఉండగా, మిగితా విభాగాలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. క్రితం నవంబర్లో ప్రాథమిక వస్తువులు 3.2 శాతం, ఇంటర్మీడియట్ గూడ్స్ (-)4.5 శాతం, మౌలిక వసతులు, నిర్మాణ రంగం 5 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి. భారత్ సులభ వ్యాపారంలో దూసుకుపోతుందని, మేక్ ఇన్ ఇండియా ఫలితాలు అద్బుతంగా ఉన్నాయని పదే పదే చెప్పుకుంటున్న మోడీ సర్కార్కు నవంబర్ మాసం పారిశ్రామికోత్పత్తి గణంకాలు చెంపపెట్టులా నమోదయ్యాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.