Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రిటైల్, జియో మేళవింపుతో త్వరలోనే కొత్త వేదిక తెస్తాం
- గుజరాత్ నుంచే శ్రీకారం చుడుతాం
- ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతల మనిషి: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ
గాంధీనగర్: దేశంలో అన్లైన్ రిటైల్ దిగ్గజాలుగా వెలుగొందుతున్న అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సంస్థలకు రిలయన్స్ ఇండిస్టిస్ సంస్థ త్వరలో గట్టి షాక్ ఇవ్వనుంది. టెలికాం రంగంలో జియో ఇన్ఫోకామ్ సంచలనం మాదిరిగానే.. అన్లైన్, ఆఫ్లైన్ రిటైల్ మార్కెట్లోకి రిలయన్స్ రిటైల్ను అందుబాటులోకి తెనున్నట్టుగా ఆ సంస్థ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ తెలిపారు. రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ గ్రూపు సంస్థల మేళవింపుగా కొత్త ఈ-కామర్స్ వేదికను ప్రారంభించనున్నట్టుగా ఆయన తెలిపారు. దీనిని తొలిసారిగా గుజరాత్ రాష్ట్రం నుంచే ప్రారంభించనున్నట్టుగా ఆయన వెల్లడించారు. గాంధీనగర్లో తొమ్మదో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో మాట్లాడుతూ.. గుజరాత్ ఎప్పటికీ తమ మొదటి ప్రాధ్యాన్యమన్నారు. తాము అందుబాటులోకి తేనున్న ఈ-కామర్స్ వేదిక వల్ల గుజరాత్లోని దాదాపు 1.2 లక్షల మంది చిరు వ్యాపారులకు సాధికారికత లభించనుందని ఆయన వివరించారు. ఈ రంగంలోనూ సత్తా చాటుతామని ఆయన తెలిపారు. అలాగే రానున్న పది సంవత్సరాల్లో తమ సంస్థ గుజరాత్లో రూ.3లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. 'రాజకీయ వలసవాదాన్ని పారద్రోలడానికి గాంధీజీ జాతీయోద్యమానికి నాయకత్వం వహించారు. ఇప్పుడు మనందరం కలిసి డేటా వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ కొత్త ప్రపంచంలో డేటా అనేది కొత్త సంపద. భారత్కు చెందిన డేటాకు భారతీయులే నేతృత్వం వహించాలన్నారు. విదేశాల గుత్తాధిపత్యాన్ని అడ్డుకోవాలని కోరారు. ప్రధాని చేతల మనిషని, డిజిటల్ ఇండియా మిషన్ లక్ష్యాల్లో దీన్ని చేర్చుతారని ముకేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు. 'గుజరాత్ రిలయన్స్ జన్మభూమి. అలాగే కర్మభూమి. మా మొదటి ప్రాధ్యాన్యం ఎప్పటికీ గుజరాత్ రాష్ట్రమే' అని స్పష్టం చేశారు. అలాగే పండిట్ దీన్ దయాళ్ విశ్వవిద్యాలయ నిర్మాణానికి రూ.150 కోట్లు కేటాయించనున్నామని తెలిపారు.
సంస్కరణల్ని వేగవంతం చేస్తాం: మోడీ
భారత్లో వ్యాపార నిర్వహణను మరింత సరళతరం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టనున్నుట్టుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమంలో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ తాము చేపట్టిన సరళీకరణ విధానాలు, సంస్కరణల వల్ల ప్రపంచ బ్యాంక్ ప్రకటించే ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగుల్లో 142వ స్థానం నుంచి 77వ స్థానానికి చేరుకున్నామని తెలిపారు. వచ్చే ఏడాది ఈ విభాగంలో మేటి 50 దేశాల సరసన భారత్ నిలిచేలా చర్యలు చేపట్టాలని తమ యంత్రాంగాన్ని కోరామని ఆయన తెలిపారు. ఇందుకు గాను అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేస్తామని ఆయన వివరించారు. ఎఫ్డీఐ నిబంధనల్లో మార్పుల మూలంగా భారత్కు 263 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్టుగా ఆయన తెలిపారు. గడిచన 18 ఏండ్ల కాలంలో భారత్కు తరలి వచ్చిన ఎఫ్డీఐలలో ఇది దాదాపు 45 శాతానికి సమానమని వెల్లడించారు.