Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: విప్రో సంస్థ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో సంస్థ 31.8 శాతం వృద్ధితో రూ.2,544.5 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. ఇదే సమయంలో సంస్థ ఆదాయం 10.17 శాతం వృద్ధి చెంది రూ.13,669 కోట్ల నుంచి రూ.15,059 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం రూ.1,930.1 కోట్లగా నమోదు అయింది. పటిష్టమైన తమ క్లయింట్ల సంబంధాలు, తమ ఎత్తుగడల పెట్టుబడులు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ తదితర అంశాలు క్రితం త్రైమాసికం ఫలితాలకు మద్దతు చేశాయని విప్రో సిఇఒ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబిదాలి జడ్ నీముచ్వాలా పేర్కొన్నారు. మెరుగైన ఫలితాల నేపథ్యంలో వాటాదారులకు సంస్థ బంపర్ బొనాంజాను ప్రకటించింది. వాటాదారులకు బోనస్ షేర్లు అందించనున్నట్టుగా వెల్లడించింది. ప్రతీ మూడు సంస్థ షేర్లకు అదనంగా ఒక బోనస్ షేర్ అందించడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్టుగా సంస్థ తెలిపింది. దీనికి తోడు బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈ ఐటి కంపెనీ ప్రతీ షేర్పై రూ.1 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. 2019 జనవరి 30ని ఇందుకు రికార్డు తేదిగా పరిగణించనున్నట్టుగా సంస్థ తెలిపింది. వచ్చే మార్చి త్రైమాసికంలో తమ ఐటి సేవల వ్యాపారం రెవెన్యూ 2,047-2,088 మిలియన్ డాలర్ల మధ్య నమోదు కావొచ్చని ఆ కంపెనీ అంచనా వేసింది. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో విప్రో షేర్ 2.91 శాతం పెరిగి రూ.346.20 వద్ద ముగిసింది.