Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీడియా కథనాలతో కుదేలైన సంస్థ స్టాక్..
- కార్పొరేట్ అవకతవకలపై సెబీకి ఫిర్యాదని రిపోర్ట్స్!
- ఒకేసారి12.12 శాతం మేర పతనమైన సంస్థ షేర్లు
- ఒక్కరోజులోనే రూ. 8,736 కోట్ల ఎంక్యాప్ ఆవిరి..
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సన్ఫార్మా షేర్లు శుక్రవారం భారీగా కుదేలయ్యాయి. సన్ ఫార్మాలో ప్రమోటర్లు సంస్థను అడ్డుగా పెట్టుకొని వివిధ అక్రమ లావాదేవీలను కొనసాగిస్తున్నారంటూ వెలువడిన కథనాల నేపథ్యంలో మదుపరులు భారీగా ఈ సంస్థ షేర్లను విక్రయించారు. ఇంట్రాడేలో సన్ఫార్మా షేర్లు ఏకంగా 13 శాతం వరకు నష్టపోయాయి. దీంతో ఈ సంస్థ స్టాక్ ఆరేండ్ల కనిష్టానికి పడిపోయింది. గత కొన్ని రోజులుగా సన్ఫార్మాలో నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు, అవకతవకలు జరుగుతున్నాయని తమకు ఫిర్యాదు అందినట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గత నెలలోనే ప్రకటిస్తూ వాటిని కొంత వరకు ధ్రువీకరించింది. ఆ ఫిర్యాదును పూర్తిస్థాయి పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం మరో ఫిర్యాదు కూడా దాఖలైనట్లు మీడియాలో వార్తలు రావడంతో కంపెనీ షేర్లు కుప్పకూలాయి. తాజా కథనాలు సన్ ఫార్మాపై కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఆరంభ ట్రేడింగ్లో కంపెనీ షేరు విలువ 12 శాతానికి పైగా కుంగి రూ.375.40కు పడిపోయింది. ఇది దాదాపు 52 వారాల కనిష్టం కావడం విశేషం. క్షణాల వ్యవధిలోనే కంపెనీ తన మార్కెట్ విలువలో రూ.12,400 కోట్లకు పైగా కోల్పోయింది. అనంతరం కొంత కోలుకొని మార్కెట్లు ముగిసే సమయానికి 8.52 శాతం నష్టంతో రూ.390.75 వద్ద ముగిసింది. దీంతో శుక్రవారం ఒక్కరోజే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.8,736 కోట్ల మేర పతనమైంది. ఫలితంగా సన్ ఫార్మా మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల మార్కుకు దిగువకు జారి రూ.93,751.44కు చేరింది.
పతనానికి ప్రధాన కారణం ఇదే..
మనీలైఫ్ మేగజైన్లో వెలువడ్డ కథనం ప్రకారం సన్ ఫార్మా ప్రమోటర్లు దిలీప్ సంఘ్వీ, సునీల్ వాడియాలు ఉమ్మడిగా ఆదిత్య మెడీసేల్స్ అనే సోల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా అమ్మకాలు కొనసాగిస్తున్నారని తేలింది. 2014 నుంచి 2017 మధ్యకాలంలో ఆదిత్య మెడిసేల్స్ కంపెనీ.. సన్ ఫార్మా సహ వ్యవస్థాపకుడు సుధీర్ విలియాకు నియంత్రణలోని సురక్ష రియల్టీ మధ్య రూ.5,800 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయని, వీటికి తోడు ఆదిత్య మెడీ ద్వారా సురక్షా రియాల్టీ అనే సంస్థతో కలిసి సుమారు రూ.5,000 నుంచి 6000 కోట్ల లావాదేవీలు జరిపినట్టు మనీ లైఫ్ ప్రచురించింది. సంస్థ ప్రమోటర్లుగా సన్ ఫార్మాను అడ్డం పెట్టుకుని ప్రమోటర్లు వ్యక్తిగత వ్యాపారాలను కొనసాగిస్తున్నారంటూ ఒక వ్యక్తి సెబీకి ఫిర్యాదు చేశారంటూ మేగజైన్ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆధారలతో కథనం కూడా వెలువరించింది. దీంతో మార్కెట్లలో ఒక్కసారిగా సన్ఫార్మా కలకలం మొదలైంది. ర్యాన్బాక్సీ ఇన్సైడర్ ట్రేడింగ్పై సెబీకి ఫిర్యాదు చేసిన వ్యక్తే సన్ ఫార్మాపై తాజాగా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఫిర్యాదుదారు దిలీప్ సంఘ్వీ సహా అతని బావమరిది సుధీర్ వాలియాపై సెబీకి 172 పేజీల సుదీర్ఘ లేఖ రాశారని సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఫిర్యాదుదారు అనేక సాక్ష్యాధారాలను మార్కెట్ నియంత్రణ సంస్థకు సమర్పించిన నేపథ్యంలో సెబీ దర్యాప్తునకు ఆదేశించినట్టు సమాచారం. అయితే సన్ఫార్మా మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. కొందరు వ్యక్తులు, సంస్థలు కావాలనే మదుపరుల ప్రయోజనాలను దెబ్బ తీసేలా ఇలాంటి అసత్య ఆరోపణలను సృష్టించి ప్రచారం చేస్తున్నారని.. నష్ట నివారణకు గాను సెబీ తగ్గిన చర్యలు తీసుకొని, బాధ్యులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని సెబీని కోరింది.