Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రి-వైవ్ పేరుతో ఈ-కామర్స్ ఫోర్టల్ ప్రారంభం
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: తెలంగాణలోని చేనేతకారులకు చేయూతను అందించేందుకు సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని చేనేత వృత్తిదారులు తమ కార్యకలాపాలను మరింతగా విసృత పరుచుకునేందుకు, మెరుగైన వినియోగదారులకు చేరువయ్యేలా సంస్థ రి- వైవ్ డాట్ ఇన్ పేరుతో సరికొత్త ఈ-కామర్స్ ఫోర్టల్ను ప్రారంభించింది. చేనేతకారులు సహజ రంగులను ఉపయోచి రూపొందించిన మేటి డిజైన్లను ఈ పోర్టల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నట్టుగా మైక్రోసాఫ్ట్ ఇండియా ఆర్ అండ్ డీ విభాగం ఎండీ అనిల్ బన్సాలీ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని చేనేత క్లస్టర్లకు ఈ పోర్టల్ సేవలను అందుబాటులోకి తేనున్నట్టుగా బన్సాలీ తెలిపారు. దీనికి తోడు లాభదాయకత ఆశించని ఎన్జీవోల ద్వారా చేనేతకారులకు నిర్వహణ మూలధనం లభించేలా కూడా ఈ కొత్త ప్రాజెక్టులో చర్యలు చేపట్టనున్నట్టుగా ఆయన తెలిపారు. కొత్త ప్లాట్ఫాం ద్వారా భారత చేనేత గొప్పదనాన్ని విస్తరించి చేనేతకారుల మార్కెట్ను విస్తరింపజేసేందుకు వీలు పడుతుందని బన్సాల్ వివరించారు. దీంతో వారి సాధికారికతకు ఇది తోడ్పడగలదని తెలిపారు. చేనేత ఉత్పత్తులకు క్యాడ్ మరియు రంగులు అద్దేందుకు గాను చేనేతకారులకు శిక్షణనిచ్చేందుకు గాను మైక్రోసాఫ్ట్ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థతో జట్టుకట్టినట్టుగా తెలిపారు. తొలి విడుతగా శిక్షణ పొందిన వంద మందికి ఈ సందర్భంగా ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మైక్రోసాఫ్ట్ చర్యతో చేనేతకారులు తమంతట తాము నిలదొక్కుకొనేందుకు, చేతివృత్తిదారులకు తగిన ఉపాధి కల్పించేందుకు వీలు కల్పిస్తుందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అన్నారు.