Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరిన్ని విధానపరమైన చర్యలపై దృష్టి సారించాల్సి ఉంది
- ప్రభుత్వం, బీబీబీతో కలిసి పని చేస్తున్నాం
- బ్రెగ్జిట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం
- ఆర్థిక స్థిరత్వమే ధ్యేయంగా మా అడుగులు:
- ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత దాస్
గాంధీనగర్: దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేలా కార్పొరేట్ గవర్నెన్స్ను మరింతగా పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. శనివారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన వైబ్రెంట్ గుజరాత్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఆర్బీఐ గవర్నర్గిరి చేపట్టిన తరువాత ఆయన మొదటి అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ దేశీయ బ్యాంకింగ్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే విషయమై విధానపరమైన చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పెరుగుతోన్న భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం, సంక్షిష్టత ఈ అవసరాన్ని మరింతగా ఎత్తిచూపుతోందని ఆయన అన్నారు. ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంక్తో పాటు వివిధ బ్యాంకుల్లో వెలుగుచూసిన మోసాలను ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. బ్యాంకుల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు గాను ప్రభుత్వం, బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బీబీబీ), ఆర్బీఐలు కలిసి పని చేస్తున్నాయని శక్తికాంత్ తెలిపారు. పనితీరు మూల్యాంకణ లక్ష్యంతో విధివిధానాలను రూపొందించే దిశగా తాము కలిసి పని చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విధివిధానాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్పొరేట్ పాలనకు కొత్త రూపాన్ని నిర్వచించేలా వాటి రూపకల్పన జరుగుతోందని ఆయన అన్నారు. దీని వల్ల బ్యాంకుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగ గలదని ఆయన వివరించారు. దాస్ కంటే ముందు ఆర్బీఐ గవర్నర్గా పని చేసిన ఉర్జిత్ పటేల్ పలు ప్రయివేటు బ్యాంకుల పట్ల కఠినంగా వ్యవహరించి వాటి యాజమాన్యంలో మార్పులు వచ్చేలా పలు కీలక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఆ పదవిలోకి వచ్చిన శక్తికాంత బ్యాంకులపై ఎలాంటి తీరును ప్రదర్శిస్తారోనన్న ఆలోచనల మధ్య దాస్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
సూక్ష్మ గణాంకాలకే ప్ర్రథమ ప్రాధాన్యత..
దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుకు అద్దంలా నిలిచే సూక్ష్మగణాంకాల్లో మెరుగైన వృద్ధిని సాధించేందుకే తాము ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వనున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత తెలిపారు. దీనికి తోడు అంతార్జతీయంగా నెలకొన్న తీవ్ర అనిశ్చిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశంలో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడంపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్గు దాస్ వివరించారు. బ్రెగ్జిట్ విషయమై ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలను గురించి శక్తికాంత్ మాట్లాడుతూ అంతర్జాతీయ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోందని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్కు ఎదుర య్యే సవాళ్లు, అందుబాటులోకి వచ్చే కొత్త అవకాశాలను క్షుణ్ణంగా బేరీజు వేసుకొని ఆర్బీఐ ఒక విధానపనరమై స్పందనను వెలువరిస్తుందని ఆయన అన్నారు. ఇటీవలి బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో భారత కంపెనీలు, విధానకర్తలు తమ వ్యూహాలను తిరిగి రూపొందించుకొని తగిన విధంగా ప్రతిస్పందించాల్సి ఉంటుందని అన్నారు.