Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అధిక విలువ కలిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పన్ను రిటర్నులను 2018-19 అసెస్మెంట్ ఇయర్లో దాఖలు చేయని వారికి ప్రభుత్వ మరో ఆవకాశం కల్పిస్తూ ప్రకటన చేసింది. సదరు లావాదేవీకి సంబంధించిన వివరాలతో ఆదాయపు పన్ను శాఖ నుంచి ఈమెయిల్ గానీ.. ఎస్ఎంఎస్ గానీ అందిన 21 రోజుల్లోగా రిటర్నులను గానీ వాటికి సమాధానాన్ని గానీ ఫైల్ చేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. రిటర్నులు దాఖలు చేయకపోవడానికి సంబంధించి వర్తమానం అందిన తరువాత కూడా ఐటీఆర్ దాఖలు పరచని నేపథ్యంలో సదరు వ్యక్తిపై ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీబీడీటీ వివరించింది. 2017-18 మధ్య కాలానికి సంబంధించి దేశంలో పలువురు అధిక విలువ కలిగిన లావాదేవీలు జరిపిన సమాచారం తమ వద్ద ఉందని. వారు ఇంత వరకు పన్ను రిటర్నులు దాఖలు చేయలేదని సీబీడీటీ వెల్లడించింది. వీటికి సంబంధించి సంబంధితులకు సమాచారం అందిస్తున్నామని వారు.. వర్తమానం అందిన మూడు వారాల లోపు (21 రోజుల లోపు) వారు తగిన ఆధారాలతో ు సంతృప్తికరణమైన వివరణనిస్తే ఎలాంటి చర్యలుండవని తెలిపింది. లేదంటే ఆయా లావాదేవీకి సంబంధించిన పన్ను బకాయిలు చెల్లించేందుకు వీలు కల్పిస్తున్నట్టుగా సీబీడీటీ వెల్లడించింది. అధిక విలువైన లావాదేవీకి సంబంధించిన సమాచారాన్ని ఐటీ శాఖ ఆర్థిక లావాదేవీల నివేదిక (ఎస్ఎఫ్టీ), మూలం వద్ద పన్ను తగ్గించుకోవడం (టీడీఎస్), మూలం వద్ద పన్ను వసూళ్లు (టీసీఎస్), విదేశాల నుంచి నిధుల రాక, ఎగుమతులు మరియు దిగుమతులు తదితరాల ద్వారా సమీకరించినట్టుగా సమాచారం. ఐటీ శాఖ అందుబాటులోకి తెచ్చిన నాన్ఫైలర్ మోనిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎస్) ద్వారా అధిక విలువ కలిగిన లావాదేవీలను, వాటి పన్ను బకాయిలతో సహా రిటర్నులు దాఖలు చేయని వారి వివరాలు ప్రభుత్వానికి చేరుకుంటున్నాయి. ఇలాంటి లావాదేవీలకు సంబంధించిన వివరణలు గానీ.. లేదా ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు గాను ఎవ్వరూ ఐటీ శాఖ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని.. https://incometaxindiaefiling.gov.in. ఆన్లైన్ ద్వారా వివరాలను సమర్పించవచ్చని సీబీడీటీ తెలిపింది.