Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనవరిలో 60% పతనం
- 24 నెలల కనిష్టానికి క్షీణత
- గత కొన్ని నెలలుగా ఇదే స్థితి
- మార్కెట్లలో ఒడిదుడుకుల ప్రభావం
ముంబయి : మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ స్కీముల్లో పెట్టుబడుల ఆసక్తి పడిపోతుంది. ప్రస్తుత ఏడాది జనవరిలో ఈ రంగంలో పెట్టుబడులు రూ.6,158 కోట్లకు పడిపోయి.. 24 మాసాల కనిష్ట స్థాయికి దిగజారాయి. కొత్త ఏడాది తొలి మాసంలో స్టాక్ మార్కెట్లలో చోటు చేసుకున్న తీవ్ర ఒడిదుడుకులు ఎమ్ఎఫ్లపై ప్రతికూల ప్రభావాన్ని పెంచాయి. అదే విధంగా రాజకీయ పరిణామాల్లో అనిశ్చిత్తి పెరగడం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసిందని నిపుణులు పేర్కొంటున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (ఎఎంఎఫ్ఐ) రిపోర్టు ప్రకారం.. 2019 జనవరిలో ఎంఎఫ్ల నికర రాకలో తగ్గుదల చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నట్టు పేర్కొంది. క్రితం డిసెంబర్లో ఎంఎఫ్లపై పెట్టుబడులు రూ.6,606 కోట్లుగా నమోదయ్యాయి. ఈ నెల పెట్టుబడులతో పోల్చితే జనవరి నికర ఎంఎఫ్ల నమోదులో 6.7 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. 2018 ఇదే జనవరిలో ఏకంగా ఎంఎఫ్ ఈక్విటీ ఫండ్లలో రూ.15,390 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. దీంతో పోల్చితే 2019 జనవరి పెట్టుబడుల్లో ఏకంగా 60 శాతం పతనం చోటు చేసుకుంది. ఫ్యూర్ ఈక్విటీ ఫండ్స్, ఈక్విటీ లింకుడ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఇఎల్ఎస్ఎస్), టాక్స్ సేవింగ్స్ వెహికల్స్ ఇన్వెస్టింగ్ ప్రెడొమినెంట్లి విభాగాలు ఈక్విటీ ఫండ్ల డేటాలో భాగంగా ఉన్నాయి. ఎఎమ్ఎఫ్ఐ రిపోర్టు ప్రకారం క్రితం జనవరిలో రూ.1,076 కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి.
2019 జనవరిలో ఈక్విటీ ఫండ్ల నుంచి ఇన్వెస్టర్లు రూ.11,397 కోట్లు తిరిగి తీసుకున్నారు. ఇంతక్రితం మాసంలో ఈ మొత్తం రూ.11,234 కోట్లుగా ఉంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) మ్యూచువల్ ఫండ్స్ నిబంధనలను కఠినతరం చేస్తుందన్న విశ్లేషణలు ఎంఎఫ్ల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపాయని నిపుణులు పేర్కొన్నారు. అదే విధంగా భారత్లో వచ్చే ఏప్రిల్-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లలో చోటు చేసుకుంటున్న తీవ్ర హెచ్చు.. తగ్గులు ఎంఎఫ్లపై కూడా పెట్టుబడుల ఆసక్తిని తగ్గిస్తున్నాయని విశ్లేషించారు. ఎఎమ్పీఐ రిపోర్టు ప్రకారం.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్పై రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం ఆసక్తి చూపారు. 2019 జనవరిలో సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సీప్)లో రిటైల్ ఇన్వెస్టర్లు రూ.8,063.67 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇంతక్రితం మాసంలో ఈ మొత్తం రూ.8,022.33 కోట్లుగా నమోద య్యింది. ఎంఎఫ్ల్లో పెట్టుబడిదారులు క్రమ పెట్టుబడుల కోసం సిప్లను ఎంచుకుంటున్న విషయం తెలిసిందే.
ఆందోళనకరం.. : నిపుణులు
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న అనిశ్చిత్తికి తోడు భారత వృద్ధి రేటుపై రిటైల్ ఇన్వెస్టర్ల అనుమానాలు, స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురి కావడంతో ఎంఎఫ్ల్లో ప్రతికూలత చోటు చేసుకుంటుందని ఎఎంఎఫ్ఐ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈఓ) ఎన్ఎస్ వెంకటేష్ విశ్లేషించారు. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించినందున భవిష్యత్తు వారాల్లో ఈ రంగంలో పెట్టుబడులు పెరుగొచ్చని అంచనా వేశారు. ప్రస్తుత అనిశ్చితి కొనసాగితే పెట్టుబడుల రాక మరింత తగ్గొచ్చని మోతిలాల్ ఓస్వల్ ఫండ్ సీఈఓ ఆశిష్ సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సిప్ల్లో పెరుగుదల చోటు చేసుకున్నప్పటికీ.. స్థూలంగా ఎంఎఫ్ల్లో పెట్టుబడులు తగ్గుతున్నాయన్నారు. ఈక్విటీల్లో క్రమంగా తగ్గుదల వల్ల అవకాశాలను ప్రతికూలతలోకి నెట్టుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పేలవమైన ప్రగతి, మోసపూరిత ఫండ్ల విక్రయాలు, తక్కువ కమిషన్లు ఎంఎఫ్లపై ఆసక్తిని తగ్గించడానికి ప్రధాన కారణాలని తెలిపారు. భవిష్యత్తు రాబడిపై అనిశ్చిత్తి, ఫండ్లపై తక్కువ రాబడి కూడా ఎంఎఫ్లపై ప్రభావం చూపుతున్నాయని ప్లాన్ ఎహెడ్ ఫైనాన్సీయల్ అడ్వైజర్ విశాల్ ధావన్ పేర్కొన్నారు. విదేశీ మదుపర్లు భారత మార్కెట్ల నుంచి 2018లో 4,557.39 మిలియన్ డాలర్ల విలువ చేసే ఈక్విటీలను తరలించుకుపోయారు. క్రితం ఒక్క జనవరిలో 75.35 మిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలిపోయాయి. ఈ ప్రభావం ఎంఎఫ్లపై పడిందని ధావన్ విశ్లేషించారు.