Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల్లో ఎన్నో ఆశలు కల్పించిన మోడీ సర్కార్
- ఖాతాల సంఖ్య 34.14కోట్లు
న్యూఢిల్లీ : జన్ధన్ ఖాతాల్లో ప్రజలు దాచుకుంటున్న మొత్తాలు పెరుగుతున్నాయిగానీ, ఆ ఖాతాల్లో మోడీ సర్కార్ వేసిన డబ్బుల లెక్క మాత్రం తేలటం లేదు. నల్లధనం తీసుకొస్తామనీ, వివిధ పథకాలతో రుణాలు ఇస్తామనీ ఆశలు కల్పించిన మోడీ కోట్లాదిమంది ప్రజలతో జన్ధన్ ఖాతాల్ని తెరిపించింది. ఇప్పుడా జన్ధన్ ఖాతాల్లో ప్రజల డిపాజిట్లు త్వరలో రూ.90వేల కోట్లు దాటనుందని సమాచారం!
ప్రభుత్వం ఈ ఖాతాదారులకు రూ.2లక్షల మేరకు ప్రమాద బీమా కల్పించడం ప్రజలను ఆకర్షిస్తోంది. దీంతో భారీ సంఖ్యలో కొత్తగా ఖాతాలను తెరుస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం, జనవరి 30నాటికి ఈ ఖాతాల్లో జమైన మొత్తం రూ.89,257.57కోట్లుగా ఉంది. ముఖ్యంగా మార్చి 2017 నుంచి ఈ ఖాతాల్లో జమ చేసిన మొత్తం పెరుగుతూ వస్తోంది.
ప్రధానమంత్రి జన్ధన్ యోజనను 2014 ఆగస్టు 28 ప్రారంభించారు. దీనిని ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలుజేయాలని నిర్ణయించారు. గత ఏడాది ఆగస్టు 28 తర్వాత నుంచి ఈ ఖాతాదారులకు అందించే ప్రమాద బీమా మొత్తాన్ని రూ.2లక్షలకు పెంచారు. ఓవర్డ్రాఫ్ట్ మొత్తాన్ని కూడా రూ.10వేలు చేశారు. అయితే ఇంత స్వల్ప మొత్తం రుణంగా తీసుకోవటంపై ఖాతాదారులు పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. ఈ పథకం ప్రారంభించిన మొదట్లో ప్రతి ఇంటికీ ఒక ఖాతా అనే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రతి వ్యక్తికీ ఒక ఖాతా ఇవ్వాలనే ఉద్దేశాన్ని చేర్చారు. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న సమాచారంమేరకు జన్ధన్ ఖాతాదారుల సంఖ్య 34.14కోట్లకు చేరుకుంది.