Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) నుంచి స్థిరాస్తి రంగానికి కాస్త ఊరట కలిగించే అంశం తమ ప్రభుత్వం పరిశీలనలో ఉందని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. స్థానికంగా క్రెడారు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రానున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో స్థిరాస్తి రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పలు చర్యలు చేపట్టనున్నట్టుగా ఆయన వివరించారు. మధ్యలో నిలిచిపోయిన స్థిరాస్తి ప్రాజెక్టులను తిరిగి పట్టాలెక్కించేందుకు గాను బ్యాంకులు తమ వంతుగా చేయూతను అందించాలని ఆయన కోరారు. ఇందుకు గాను బ్యాంకులు రెండు వారాల్లోగా ఆయా సంస్థల వారితో సమావేశం కావాలని మంత్రి సూచించారు. గృహ నిర్మాణ రంగానికి రుణాలను అందించడంలో వేగం పెంచాలని ఆయన బ్యాంకులకు పీయూష్ నిర్ధేశించారు. గృహ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను తాము ప్రధాని దృష్టికి తీసుకువెళ్లామని.. అయితే జీఎస్టీ నిర్మాణాన్ని పున:పరిశీలించి తగ్గించే విధంగా తగిన చర్యలు చేపట్టాలని తమకు మోడీ నిర్ధేశించినట్టుగా పీయూష్ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్బీఐ చైర్మెన్ రజనీష్ కుమార్ కూడా పాల్గొన్నారు.గత సమావేశంలోనే స్థిరాస్తి రంగపు సమస్యలపై సమగ్రంగా మంతనాలు జరిపినట్టుగా ఆయన తెలిపారు. అయితే భిన్నాభిప్రాయాల నేపథ్యంలో పలు అంశాలపై ఏకాభిప్రాయానికి రాలేకపోయామని ఆయన అన్నారు.