Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 600 కోట్ల చేయూతకు బ్యాంకుల సంసిద్ధత
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్ధిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు బ్యాంకర్లు ఊపిరి పోయడానికి ముందుకు వస్తున్నట్లు సమాచారం. ఈ కంపెనీకి ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకులు రూ.600 కోట్ల అత్యవసర రుణం ఇవ్వడానికి సంసిద్దత వ్యక్తం చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వారు తెలిపారు. జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకులు నరేష్ గోయల్, ఎతిహాద్ ఎయిర్వేస్ షేర్లను గ్యారంటీగా పెట్టుకుని నిధులు సమకూర్చనున్నట్లు పేరు చెప్పుకోవడానికి ఆసక్తి చూపని ఒక అధికారి తెలిపారు. ఈ విషయాన్ని21న జరగనున్న జెట్ ఎయిర్వేస్ అత్యున్నత వాటాదారుల మీటింగ్లో దీన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. దీంతో తీవ్ర నగదు సంక్షోభంలో ఉన్న జెట్ ఎయిర్వేస్కు కొంత ఉపశమనం లభించినట్టయింది. గోయల్కు చెందిన ఈ సంస్థ రుణాలు, వడ్డీల చెల్లింపులు, ఉద్యోగులకు తగు సమయంలో వేతనాలు ఇవ్వడంలో విఫలమైన విషయం తెలిసిందే. నగదు మద్దతుపై గత కొన్ని రోజులుగా ఎతియాడ్, గోయల్, ఎస్బిఐ మధ్య తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదిత నగదు మద్దతు సంస్థకు చాలా సానుకూలతను ఇవ్వనుందని ముంబయి కేంద్రంగా పని చేస్తున్న ఇండియా నివేష్ సెక్యూరిటీస్ అనలిస్టు మయూర్ మిలక్ పేర్కొన్నారు. చమురు ధరలు కూడా బ్యారెల ధర 85 నుంచి 60 డాలర్లకు తగ్గినందున మరికొంత మద్దతు లభించనుందన్నారు. ఈ సహకారంపై అటు ఎస్బీఐ, ఇటు జెట్ ఎయిర్వేస్ కాని ఎలాంటి ప్రకటన చేయలేదు. జెట్ ఎయిర్వేస్లో అబూదాబికి చెందిన ఎతిహాద్కు 24 శాతం వాటా ఉంది. గత ఏడాది కాలంలో జెట్ ఎయిర్వేస్ షేర్లు 73 శాతం పతనమయ్యాయి. గురువారం బిఎస్ఇలో ఈ కంపెనీ షేర్ 0.98 శాతం పెరిగి రూ.225.80 వద్ద ముగిసింది. కాగా, పస్తుత ఆర్ధిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో జెట్ ఎయిర్వేస్ రూ.587.77 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. చవి చూసింది. ఇంతక్రితం ఆర్ధిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.165.25 కోట్ల నికర లాభాలు సాధించింది. రుణ పరిష్కార ప్రణాళిక, నిధుల సమీకరణ, అప్పుల పున:వ్యవస్థీకరించడానికి జెట్ ఎయిర్వేస్ బోర్డు ఆమోదం తెలిపింది.