Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: వారాంతంలోనూ దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాలు వీడలేదు. అంతర్జాతీయ, జాతీయ పరిణామాల నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడితో ఏడో సెషన్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. అంతర్జాతీయంగా అమెరికా రిటైల్ అమ్మకాల్లో తగ్గుదల, అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాల్లో అనిశ్చిత్తి ముఖ్యంగా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. పలు పరిణామాల మధ్య శుక్రవారం సెషన్ ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగింది.కాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో మోడీ సర్కారు ఎలాంటి స్పందనను కనబరచనుందో అన్న భయాలు మార్కెట్లను వెంటాడాయి. ఈ నేపథ్యంలో పలు కంపెనీల లాభదాయకత పెరిగినప్పటికీ మదుపరులు దీనిని పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. ఫలితంగా ఎస్ఈ సెన్సెక్స్ ఒక దశలో ఏకంగా 365 పాయింట్లు పతనమయ్యింది. చివరి నిమిషంలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు భారీ నష్టాల నుంచి బయటపడ్డాయి. అయినా మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 67.27 పాయింట్ల నష్టంలో 35,808.95కు పడిపోయింది. ఇంట్రా ట్రేడింగ్లో సెన్సెక్స్ 36,022-35,510 మధ్య కదలాడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 21.65 పాయింట్లు కోల్పోయి 10,724 వద్ద ముగిసింది. దీంతో గత నాలుగు నెలల్లోనే ఎప్పుడు లేని విధంగా సూచీలు దాదాపు 2 శాతం మేర పతనమవడం విశేషం. రంగాల వారిగా వైద్య, లోహ, ఆటో, బ్యాంకింగ్, కన్సూమర్ డ్యూరెబుల్స్ సూచీలు 0.50 శాతం నుంచి 2.50 శాతం మేర నష్టపోయాయి.