Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పీఎస్బీ లోన్ ఇన్ 59 మినెట్స్' పోర్టల్ ఫ్లాప్
- ఎంఎస్ఎంఈల నుంచి 1.31 లక్షల దరఖాస్తులు
- కోరిన రుణం అందింది కేవలం 40వేల మందికే..
- రుణాలిచ్చేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది విముఖత
- మళ్లీ మాకు పాత కష్టాలే రిపీట్: ఔత్సాహికులు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలోని లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) ఊతం ఇచ్చేలా మోడీ సర్కారు అందుబాటులోకి తెచ్చిన గంటలోపు దాదాపు రూ.కోటి వరకు రుణ పథకం ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. దీపావళి నేపథ్యంలో ఎంఎస్ఎంఈలకు ఊతం ఇచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది నవంబరులో రూ.కోటి దాకా రుణాలను కేవలం 59 నిమిషాల్లో పొందవచ్చంటూ.. 'పీఎస్బీ లోన్ ఇన్ 59 మినెట్స్' పేరిట ఒక ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. వ్యాపారం కోసం నిధులు అవసరమైన ఎంఎస్ఎంఈలు ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. వివరాలన్నింటినీ ఆన్లైన్లో సమీక్షించిన అధికారులు కేవలం 59 నిమిషాలలోపు లోన్ అవసరమైన వారికి రుణం అందించే బ్యాంక్ల శాఖ వివరాలను చేరవేసేలా ఈ పోర్టల్ను తీర్చిదిద్దారు. అయితే కేంద్రం అందుబాటులోకి తెచ్చిన ఈ పోర్టల్ ఆశించిన రీతిలో ఎంఎస్ఎంఈలకు సహాయపడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చిన్న రుణాలకు పెద్ద డిమాండ్..
'పీఎస్బీ లోన్ ఇన్ 59 మినెట్స్' పోర్టల్కు దేశ వ్యాప్తంగా భారీగా డిమాండ్ ఉందని అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన కేవలం రెండు నెలల కాలంలోనే దాదాపు 1.31 లక్షల మంది ఔత్సాహిక ఎంఎస్ఎంఈల వారు దరఖాస్తు చేసుకున్నారు. పోర్టల్ ద్వారా రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారు సగటున రూ.30 లక్షల వరకు రుణాలను కోరడం కనిపించింది. దరఖాస్తుదారుల మొత్తం రుణ విలువ దాదాపు రూ.40,000 కోట్ల దరిదాపుల్లో ఉంది. అయితే పోర్టల్ ఆన్లైన్లో అప్లికేషన్లను పరిశీలించి సంబంధిత బ్యాంకులకు ఔత్సాహిక ఎంఎస్ఎంఈల వివరాలను చేరవేస్తున్నప్పటికీ.. బ్యాంకులు వారికి రుణాలను ఇవ్వడంలో జాప్యం చేస్తున్నట్టు విమర్శలు వినవస్తున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలోని బ్యాంకు సిబ్బంది ఈ తరహా లోన్లను అందించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని.. ఆధారాల నిర్ధారణ జరపకుండానే రుణ ధరఖాస్తును తిరస్కరిస్తున్నట్టుగా సంబంధితులు ఆరోపిస్తున్నారు. రుణాలను అందించే ముందు వివిధ స్థాయిల్లో లోన్ అప్లికేషన్లను పరిశీలించాల్సి ఉన్నందును పోర్టల్లో వాగ్ధానం చేసినట్లుగా కేవలం గంటలోపు రుణ వితరణ జరపడం కూడా బ్యాంకులకు కష్టతరంగా మారింది. దీంతో మోడీ సర్కారు చేసిన గంట లోపు కోటి రుణం వాగ్ధానం గాలిమాటగానే మారిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో మొత్తంగా 1.31 లక్షల దరఖాస్తులు రాగా.. ఇందులో 1.12 లక్ష అప్లికేషన్లకు పోర్టల్ ఆమోదం లభించింది. అయితే ఇందులో కేవలం 40,669 దరఖాస్తు దారులకు మాత్రమే రుణాలు లభించాయి. ఇవి కూడా తక్కువ మొత్తం రుణాల వారికే అత్యధికంగా ఉన్నట్టుగా గణాంకాల ద్వారా తెలుస్తోంది. అంటే ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం మూడో వంతు మందికి మాత్రమే పీఎస్బీ బ్యాంకు రుణాలు అందినట్టయింది. దరఖాస్తుకు బ్యాంక్ల సమ్మతి లభించినప్పటికీ రుణ వితరణ ప్రక్రియ పూర్తిగా ఒక కొలిక్కి వచ్చేందుకు గాను దాదాపు రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుండటం పట్ల లబ్ధిదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు రూ.25 లక్షల కోట్లు అవసరం..
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలిచే ఎంఎస్ఎంఈల లోన్ మార్కెట్ విలువ దాదాపు రూ.25 లక్షల కోట్ల వరకు ఉంటుందని సిడ్బీ, సిబిల్లు ప్రచురించే 'ఎంఎస్ఎంఈ ప్లస్' వెల్లడించింది. దీనిలో దాదాపు ప్రభుత్వ బ్యాంకుల వాటా దాదాపు 50 శాతం వరకు ఉంటుందని ఈ పబ్లికేషన్ తెలిపింది. మరోవైపు రూ.10 లక్షలలోపు బ్యాంక్ రుణం అవసరమైన ఎంఎస్ఎంఈ సంస్థల రుణ మార్కెట్లో 75 శాతం వాటా ప్రభుత్వ బ్యాంకులదేనని ఈ పత్రిక తెలిపింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) అందించే రుణాలపై వడ్డీ తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది పీఎస్బీల బాట పడుతుండడం గమనార్హం. దీనికి తోడు పీఎస్బీల వద్ద తయారీ రంగానికి చెందిన ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, కెమికల్స్, ఆటో విడిభాగాలు తదితర పరిశ్రమలకు ఇపోర్ట్ సోర్స్ ఆఫ్ ఫండింగ్ కింద రుణం లభించడం కూడా ఎంఎస్ఎంఈలకు బాగా కలిసి రానుంది. ఈ నేపథ్యంలో ఈ పరిశ్రమల వారు ఎక్కువగా పీఎస్బీల బాట పడుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ప్రత్యేక పోర్టల్ ఎంఎస్ఎంఈలలో కొత్త ఆశలను రేపింది. కానీ సాధరణంగా బ్యాంక్కు వెళ్లి రుణాలకు దరఖస్తు చేసుకొని లోన్ పొందే ప్రక్రియకు.. పోర్టల్ ద్వారా రుణం పొందే ప్రక్రియకు మధ్య పెద్దగా ప్రయోజనం కలగడం లేదని పోర్టల్ ద్వారా రుణం పొందేందుకు గాను ప్రయత్నించిన వారు వాపోతున్నారు. ఇక్కడ కూడా బ్యాంక్ సిబ్బంది వివిధ వెరిఫికేషన్ల పేరుతో రుణ వితరణలో తీవ్ర జాప్యం చేస్తున్నారని.. ఈ నేపథ్యంలో మోడీ తెచ్చిన ప్రత్యేక పోర్టల్తో ఒరిగిందేమీ లేదన్నది వారి మాట.