Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'స్టార్టప్స్'పై పెరుగుతోన్న ఐటీ శాఖ దాడులు
- కనీస సమాచారం లేకుండానే సొమ్ము జప్తు
- 'ఏంజెల్ పన్ను'తో సంస్థలు ఉక్కిరిబిక్కిరి...
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశీయ ప్రతిభను ప్రోత్సహించేలా స్టార్టప్ (అంకుర) సంస్థలకు తగిన తోడ్పాటును అందిస్తామంటూ ప్రధాని మోడీ చేసిన వాగ్ధానాలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం నుంచి తగిన తోడ్పాటు లేక చాలా సంస్థలు ప్రారంభమైన కొద్ది నెలల్లోనే బోర్డు తిప్పేస్తుంటే.. మరోవైపు ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొని రాణిస్తున్న సంస్థలపై సర్కారు వర్గాల వేధింపులు అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో వారు వ్యాపారాలను మూసివేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా పన్ను నోటీసులను జారీ చేయడంతో పాటు, సరైన వివరణనివ్వడం లేదన్న సాకుతో సంస్థల బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ వర్గాలు స్తంభింపజేస్తున్నాయి. కొన్ని కేసుల్లోనైతే ఖతాల స్తంభనతో ఆగకుండా ఖాతాల్లో జమ చేసిన నిధులను అధికారులు జప్తు చేసుకుంటున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.
సోషల్ మీడియా వేదికగా విమర్శలు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక 'స్టార్టప్ ఇండియా' కంపెనీలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆశించామని, అందుకు విరుద్ధంగా పన్నుల మోతతో తమను వేధిస్తున్నారనివారు అంకుర సంస్థల అధినేతలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలు స్టార్టప్ ఇండియా వ్యాపార వేత్తలు, వెంచర్ క్యాపిటలిస్టుల ఈ విషయమై బాహాటంగానే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. 'షట్డౌన్ ఇండియా', 'టాక్స్ టెర్రరిజమ్', 'షిఫ్ట్అవుట్ ఇండియా' హాష్ టాగ్లతో వీరు కొన్ని వారాలుగా గ్రూపులను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో వేలాదిగా విమర్శలు చేస్తున్నారు.
మోడీని నమ్మి వస్తే వేధింపులా..!
భారత దేశంలో ప్రస్తుతం ఏడు వేల స్టార్టప్ కంపెనీలు పనిచేస్తున్నాయి. 2018లో ఈ కంపెనీలు 420 కోట్ల డాలర్ల వ్యాపారాన్ని నిర్వహించాయి. భారత దేశంలో ఐటీ కార్మికులు తక్కువ వేతనాలకు దొరకడం మూలానా 2000 సంవత్సరం తర్వాత ఎక్కువ స్టార్టప్ కంపెనీలు వచ్చాయని, సిలికాన్ వ్యాలీ నుంచి వెనక్కి వచ్చి టెకీలు అనేక కంపెనీలు పెట్టారని, పెడుతున్నారని స్టార్టప్ వ్యాపారులు తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చాక స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సహిస్తామని చెప్పడంతో విశ్వసించామని వారు అంటున్నారు. ప్రస్తుతం తమ పరిస్థితి మాత్రం నిరుత్సాహంగా ఉందని వారు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము కంపెనీలను షట్డౌన్ చేసుకోవాల్సి వస్తుందని వారు సోషల్ మీడియా వేదికగా తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు.
'ఏంజెల్ పన్ను'తో వేధించేస్తున్నారు..
దేశంలోని అంకుర సంస్థల స్థితిగతులపై ఇటీవల 'లోకల్ సర్కిల్స్ సర్వే' నిర్వహించిన ఒక అధ్యయనంలో విస్తుగొలిపే నిజాలు బయటకు వచ్చాయి. ఈ అధ్యయనం ప్రకారం దాదాపు 70 శాతం స్టార్టప్ కంపెనీల యజమానులు వివిధ రకాల పన్ను నోటీసులను అందుకుంటున్నారు. ఎక్కువగా తమకు 'ఏంజెల్ పన్ను' నోటీసు అందుతున్నాయని అంకుర సంస్థల యజమానులు వాపోతున్నారు. ఒక కంపెనీ నిర్దారిత విలువ కన్నా పెట్టుబడుదారుల నుంచి ఎక్కువ ప్రీమియం వస్తే ఆ ప్రీమియంను లాభంగా పరిగణించి 30 శాతం పన్ను విధించడాన్ని ఏంజెల్ పన్నుగా వ్యవహ రిస్తారు. ఈ అధ్యయనంలో చాలా మంది తాము నడుపు తున్న అంకుర సంస్థలకు ఒకటికి మించి మూడు, నాలుగు వరకు నోటీసులు ఆందాయంటూ 30 శాతం మంది యజమానులు వాపోయారు. దీనికి తోడు పన్ను శాఖ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తమ అకౌంట్స్ నుంచి సొమ్మును అధికారు లు జప్తు చేసుకుంటున్నారని వారు వాపోతున్నారు.
ఖాతాల్లో డబ్బులు మాయం..
తాజాగా రైలు ప్రయాణికులకు భోజనాన్ని సరఫరా చేసే నోయిడాలోని 'ట్రావెల్ ఖానా' స్టార్టప్ కంపెనీ నుంచి ఆదాయం పన్ను శాఖ అధికారులు చెప్పా పెట్టకుండా ఫిబ్రవరి 6న రూ.33 లక్షల రూపాయలను ఉపసంహరించుకున్నారు. బ్యాంకు ఖాతా నుంచి హఠాత్తుగా డబ్బులు మాయం అవడంతో తాము బ్యాంకుకు వెళ్లి వాకబు చేశామని, ఆ సొమ్మును ఆదాయం పన్ను శాఖ అధికారులు డిమాండ్ డ్రాఫ్టుల రూపంలో తీసుకెళ్లినట్లు తెల్సిందని ట్రావెల్ ఖానా వ్యవస్థాపకులు పుష్పింధర్ సింగ్ తెలిపారు. అలాగే వారు భారతీయ స్టేట్ బ్యాంకు, ఐసీసీఐ బ్యాంకుల్లోని తమ ఖాతాలను స్తంభింపచేశారని ఆయన వాపోయారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో సరైన వివరణ లేని కారణంగా వాటిని తాము అనూహ్య పెట్టుబడులుగా పరిగణించి స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు చెప్పారని, తమ పెట్టుబడుల్లో నగదు లావాదేవీలే ఉండవని, అన్ని పెట్టుబడులను తాము బ్యాంకు బదిలీల ద్వారానే తీసుకుంటామని ఆయన వివరించారు. తల్లిదండ్రులకు పిల్లల వైద్యుల సేవలను అనుసంధానించే ఐదేళ్ల క్రితం ప్రారంభమైన స్టార్టప్ కంపెనీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురయింది. ఫిబ్రవరి ఆరవ తేదీనే ఈ కంపెనీ బ్యాంకు నుంచి ఆదాయం పన్ను అధికారులు రూ.72 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారని నిర్వాహకులు వాపోతున్నారు.