Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీసీ మినహా అన్ని సంస్థలూ...
- త్రైమాసిక ఫలితాల సీజన్ ముగింపు దశలో..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు ప్రభావంతో స్టాక్ మార్కెట్లు నష్టాలబాటలో పయనిస్తున్నాయి. త్రైమాసిక ఫలితాల సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో పాటు అమెరికాలో రిటైల్ అమ్మకాలు బాగా తగ్గాయి. దేశీయ రుణం, నగదు లభ్యతపై నెలకొన్న అనుమానాల కారణంగా గతవారం స్టాక్మార్కెట్లు ఆద్యంతం నష్టాలను చవిచూశాయి. షేర్లు కుదేలవుతున్న తీరు కండ్లారా చూసి..ఆర్థికంగా నష్టపోతున్న మదుపర్లు ఆచితూచి వ్యవహరించడం షురూ చేశారు. దీంతో వారం మొత్తంలో సూచీలకు ఒక్క లాభం కూడా దక్కలేదు. అటు దిగ్గజ కంపెనీలు గత వారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అత్యంత విలువైన పది కంపెనీల్లో తొమ్మిది కంపెనీలు రూ. 98వేల కోట్లకు పైగా సంపదను కోల్పోయాయి.
టాప్ 10 కంపెనీల్లో ఒక్క ఐటీసీ మినహా అన్ని సంస్థలూ నష్టాల బాటలో పయనించాయి. వీటి నష్టం విలువ రూ. 98,862.63కోట్లుగా ఉన్నది. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా పేరొందిన రిలయన్స్ కూడా గత వారం రూ. 21,456.38కోట్లు నష్టపోయింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 7,88,213.12కోట్లకు పడిపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ విలువ రూ. 19,723.34కోట్లు తగ్గి రూ. 2,34,672.03కోట్లకు చేరింది. టీసీఎస్ రూ. 11,951.35కోట్ల సంపదను కోల్పోయింది. హెచ్డీఎఫ్సీ మార్కెట్ విలువ రూ. 11,725.23కోట్లు తగ్గి రూ. 3,22,531.39 కోట్లుగా ఉన్నది. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్(హెచ్యూఎల్) రూ. 9,600.22కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 8,293.27కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 7,906.92కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 5,998.66కోట్లు, కొటక్ మహింద్రా బ్యాంక్ రూ. 2,207.26కోట్ల మేర నష్టపోయాయి. ఐటీసీ మార్కెట్ విలువ మాత్రం గతవారం రూ. 4,593.55కోట్లు పెరిగి రూ. 3,42,495.09కోట్లకు చేరింది. క్రితం వారంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ 737.53 పాయింట్లు పతనమై 35,808.95 వద్ద ముగిసింది.