Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకొ నేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ముందుకు వచ్చింది. ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లందరూ ఎస్బీఐలో ఖాతాదారులు. ఈ బ్యాంకు ఖాతా నుంచే జవాన్లకు వేతనం అందుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కో జవానుకు రూ.30లక్షల చొప్పున ఇన్సూరెన్స్ మొత్తాన్ని విడుదల చేసేందుకు ఎస్బీఐ సిద్ధమైంది. ఈ మొత్తాన్ని జవాన్ల కుటుంబాలకు అందజేయనున్నట్లు ఎస్బీఐ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి తోడు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది జవాన్లలో 23 మంది జవాన్లు ఎస్బీఐ నుంచి రుణం పొందినవారున్నారు. ఈ జవాన్ల మొత్తం రుణాలను మాఫీ చేయనున్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. దీంతోపాటు ఎస్బీఐ ఉద్యోగులు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాలని బ్యాంక్ కోరింది. ఇందుకోసం ఎస్బీఐ యూపీఐని సైతం ఏర్పాటు చేసింది. దీని ద్వారా 'భారత్ కే వీర్'కు తమ వంతు సాయం చేస్తామని తెలిపింది. కేవలం ఉద్యోగులే కాకుండా బయటి వ్యక్తులు ఎవరైనా విరాళంగా అందించాలనుకుంటే ఎస్బీఐ బ్యాంకు వర్గాలను సంప్రదించాలని సూచించింది.