Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత్లో చేపట్టిన బ్యాంకుల విలీన ప్రక్రియను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోమారు సమర్థించుకున్నారు. ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణించేందుకు భారత్లో ఎక్కువ మొత్తంలో బ్యాంకుల అవసరం లేదని ఆయన అన్నారు. బలంగా ఉండే భారీ బ్యాంకులు కొన్నయితే సరిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన బడ్జెట్ అనంతరపు ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు గాను బ్యాంకుల విలీనాలు అవసరమని పేర్కొన్నారు. సరసమైన రుణ సమీకరణను రేటును ఏర్పాటు చేసుకొని ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు గాను పెద్ద బ్యాంకుల ఏర్పాటు దోహదం చేయగలదని జైట్లీ అభిప్రాయపడ్డారు. భారతీయ స్టేట్ బ్యాంక్లో (ఎస్బీఐ) అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం తరువాత ఇప్పడు మరో దఫాగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ల విలీనపు ప్రక్రియను చేపట్టినట్టుగా ఆయన వివరించారు. ఈ విలీనపు ప్రక్రియతో దేశంలో ఎస్బీఐ, ఐసీఐసీఐ తరువాత మూడో అతిపెద్ద బ్యాంక్గా బ్యాంక్ ఆఫ్ బరోడా అవతరించనుంది. రెండో దశ బ్యాంకుల విలీనం తరువాతా సర్కారు రంగంలోని బ్యాంకుల సంఖ్య ప్రస్తుతం 18కి పడిపోనుంది. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం సక్సెస్ అని చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పలు సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని బ్యాంక్ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికీ ప్రధాన బ్యాంకు, ఇతర బ్యాంకు ఉద్యోగుల పట్ల తీవ్ర వివక్ష కొనసాగుతోందన్న విమర్శలు వినవస్తున్నాయి. దీనికి తోడు విలీనం తరువాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్బీఐ నష్టాలను నమోదు చేయడం చూస్తుంటే విలీనం సత్ఫలితాలు ఇచ్చిందని చేప్పటలేమిన బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు తాజా ప్రతిపాదించిన బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా, విజయ బ్యాంక్ల విలీనాన్ని కూడా ఉద్యోగులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
21న బ్యాంక్ చీఫ్లతో సమావేశం..
ఆర్బీఐ కేంద్ర బోర్డు అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో సర్కారుకు ఎంత మొత్తంలో మధ్యంతర డివిడెండ్ను చెల్లించాలన్న అంశంపై బిమన్జలాన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ నిర్ణయం మేరకు చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన కీలక వడ్డీరేట్ల తగ్గింపు ఫలాలు బ్యాంకులు ఎంత మొత్తంలో బ్యాంకులకు చేరవేస్తున్నాయన్న విషయమై నిర్ణయం తీసుకొనేందుకు గాను ఈ నెల 21 తాము బ్యాంకుల అధినేతలతో తాను సమావేశం కానున్నట్టుగా ప్రకటించారు.