Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్కు సె!
- ఏక పక్షంగా ఆర్బీఐ కేంద్ర బోర్డు నిర్ణయం
- 'కిసాన్ సమ్మాన్' నిధుల కోసమే కావొచ్చు: విశ్లేషకులు
- ద్రవ్యలోటు తగ్గించుకునే వ్యూహంలో భాగం!
న్యూఢిల్లీ: అంతకంతకు పెరుగుతోన్న ద్రవ్యలోటును కట్టడి చేయడంలో విఫలం అవుతోన్న మోడీ సర్కారు.. తమ ఆర్థిక అవసరాల నిమిత్తం భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నిధులను వాడుకోవాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగానే సోమవారం జరిగిన ఆర్బీఐ కేంద్ర బోర్డు సమావేశంలో ఈ దిశగా ఒక ఏకపక్ష నిర్ణయాన్ని ప్రకటింపజేసింది. ''పరిమిత ఆడిట్ సమీక్ష, ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ మేరకు డిసెంబరుతో ముగిసిన ఆరు నెలల కాలానికి ఆర్థిక ప్రగతిని సమీక్షించిన తరువాత ప్రభుత్వానికి దాదాపు రూ.280 బిలియన్ల సొమ్మును బదిలీ చేయాలని బోర్డు నిర్ణయించింది'' అని ఆర్బీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి మధ్యంతరంగా డివిడెండ్గా రూ.28,000 కోట్ల మేర నిధులు బదిలీ కానున్నాయి. డివిడెండ్ పేరుతో ఆర్బీఐ నుంచి సర్కారు నిధులను సమీకరించడం వరుసగా ఇది రెండో ఏడాది. 2017- 18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత ఆగస్టులో ఆర్బీఐ రూ.50,000 కోట్ల మేర మిగులు నిధులను సర్కారుకు బదలాయిస్తున్నట్టుగా ప్రకటించింది. ఇందులో భాగంగా గత మార్చిలోనే సర్కారు రూ.10,000 కోట్ల మేర నిధులను బదిలీ చేసింది. అంతకు ముందు ఏడాదికి గాను ఆర్బీఐ మొత్తంగా రూ.30,663 కోట్ల మేర డివిడెండ్ను సర్కారుకు చెల్లించింది. పీఎం కిసాన్ సమ్మాన్ తొలి విడత చెల్లింపులకు దాదాపు రూ.20వేల కోట్ల వరకు ప్రభుత్వానికి అవసరం ఈ నేపథ్యంలో సర్కారు ఆర్బీఐ నుంచి అత్యవసరం నిధులను తమ ఖాతాలోకి మళ్లించుకొనే ప్రకటన చేయించినట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు.
వీర జవానులకు నివాళి..
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన ఈ బోర్డు సమావేశంలో సభ్యులు పూల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన జవానులకు నివాళలర్పించారు. ఈ బోర్డు సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ గడిచిన నాలుగేండ్ల కాలంలో ప్రభుత్వ చేపట్టిన పలు సంస్కరణలు, విధనాపరమైన చర్యలను గురించి వివరించనట్టుగా సమాచారం. ఆర్బీఐ చట్టం 1934లోని 47వ సెక్షన్ ప్రకారం ఆర్బీఐ ప్రభుత్వానికి మిగులలో కొంత భాగాన్ని సర్కారుకు డివిడెండ్ రూపంలో అందించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 2019- 20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్బీఐ, జాతీయం చేసిన బ్యాంకుల నుంచి దాదాపు రూ.82,911.56 కోట్ల డివిడెండ్ రాగలదని బడ్జెట్లో అంచనా కట్టింది. 2018- 19 ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యలోటు జీడీపీలో 3.4 శాతానికి పెరుగగలదంటూ సర్కారు ద్రవ్యలోటు అంచనాలను సవరించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు 2019- 20 ఆర్థిక సంవత్సరానికి కూడా ఈ లోటు 3.4 శాతంగానే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.
కీలకంగా వ్యవహరించిన శక్తికాంత..
కేంద్రంలోని మోడీ సర్కరుకు అనుయాయుడిగా ఆర్బీఐ పగ్గాలు చేపట్టిన శక్తికాంత దాస్ ప్రభుత్వానికి మధ్యంతర డివిడెండ్ రూపంలో రూ.28000 కోట్ల మేర నిధులను అందించే విషయంలో కీలకంగా వ్యవహరించినట్టుగా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు చెబుతున్నాయి. అసలే బ్యాంకులు నష్టాల్లో కొట్టుమిట్టాడుతూ పీఏసీ నిబంధనలతో కునారిల్లుతున్న వేళ.. ఆర్బీఐ మధ్యంతర డివిడెండ్ పేరుతో సర్కారుకు నిధులను మళ్లించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ సర్కారు కాస్త ఊరట కలిగించే క్రమంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.