Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఫోర్టిస్ హెల్త్కేర్లో నిధుల మళ్లింపుకు సంబంధించిన విచారణలో పలు ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్టుగా సమాచారం. ఫోర్టిస్ హెల్త్కేర్ సంస్థలో జరిగిన మోసం విలువ దాదాపు రూ.2,000 కోట్లకు పైమాటే ఉంటుందని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్ట్గేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) అధికారిక ఒకరు వెల్లడించారు. బయటకు చెబుతున్న ఫోర్టిస్ మోసం విలువ దాదాపు రూ.403 కోట్లకు పరిమితం కాలేదని.. అంత కంటే ఎక్కువగానే ఫోర్టిస్లో అవకతవకలు జరిగి ఉంటాయని సెబీ కూడా భావిస్తోందని సదరు అధికారి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి రూ.500 కోట్లను సింగ్ బ్రదర్స్ వద్ద నుంచి వసూలు చేయాలని ఇప్పటికే సెబీ ఆదేశాలు జారీ చేసింది. అక్రమ మార్గాల్లో సంస్థ సొమ్మును ప్రమోటర్లు తమ కంపెనీలకు మళ్లించుకొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా రాధ సోమి సత్సంగ్ బియస్ అధిపతి గురిందర్ సింగ్ థిల్లాన్, మాల్వీందర్, శివీందర్ల మాజీ సహచరుడు సంజరు గోద్వానీలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రమోటర్లకు చెందిన ఆరు కంపెనీలకు ఈ నిధులను మళ్లించినట్లు దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. వివిధ రూపాల్లో ఈ నిధులు మొత్తం మళ్లీ మాల్వీందర్, శివీందర్లకు చేరినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.