Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఏంజల్' నుంచి స్టార్టప్లకు మినహాయింపు..
- ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రకటన
- దశాబ్ద కాలం సంస్థలకు స్టార్టప్ హౌదాయే..
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోడీ సర్కారు పారిశ్రామిక వర్గాలను ప్రసన్నం చేసుకొనే పనిని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తాజాగా అంకుర (స్టార్టప్) సంస్థల్లో పెరిగిపోతున్న అసంతృప్తిని దూరం చేసేలా మంగళవారం కీలక ప్రకటనలు చేసింది. తీవ్ర వివాదాస్పదం అవుతున్న స్టార్టప్స్ ఏంజల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్టుగా మంగళవాంం తెలిపింది. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల శాఖ ఒక ప్రకటన చేసింది. దీంతో షేర్ ప్రీమియంపై ట్యాక్స్ను చూసే పన్ను ఎగవేత చట్టాల నుంచి అంకుర సంస్థలకు మినహాయింపు లభించనుంది. ప్రభుత్వం తాజా నిర్ణయం మేరకు ఈ మార్పునకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) వేరుగా నోటిఫై చేయనుంది. ఆయా స్టార్టప్ సంస్థలు తమ మనుగడకు అవసరమైన నిధుల కోసం వాటాలు విక్రయించినప్పుడు ప్రీమియంపై ఆదాయపు పన్ను శాఖ వర్గాలు పన్నులు విధించడంతో అంకుర సంస్థలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. తాజా నిర్ణయం మేరకు ఏవైనా స్టార్టప్లు ప్రీమియంతో కలిపి వచ్చేలా రూ.25 కోట్ల లోపు మొత్తానికి షేర్లను విక్రయించినప్పుడు పన్ను మినహాయింపు లభిస్తుంది. దీనికి తోడు ఇకపై రానున్న రోజుల్లో సంస్థ ప్రారంభించిన ఏ ఆర్థిక సంవత్సరంలో అయినా టర్నోవర్ రూ.100 కోట్ల లోపు ఉంటే.. వాటిని స్టార్టప్లుగా పరిగణిస్తారు. దీంతో పాటు ఏదైనా ఒక కంపెనీ ప్రారంభించిన నాటి నుంచి 10ఏళ్ల వరకు స్టార్టప్గానే పరిగణిస్తారు. గతంలో కేవలం ఏడేండ్లుగా మాత్రమే ఉండేది. అయితే సదరు సంస్థలు కచ్చితంగా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండిస్టీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వద్ద నమోదవ్వాలి. స్టార్టప్ ఇండియాకు ఊతం ఇచ్చేందుకు గాను మోడీ సర్కారు ప్రరంభించిన స్టార్టప్ ఇండియా.. స్టాండప్ ఇండియా ఉత్త ఫార్స్గా మిగిలిపోతోందని.. అంకుర సంస్థలను పన్ను అధికారులు నంజుకు తింటున్నారంటూ ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తం విమర్శలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. మోడీని నమ్ముకొని వచ్చి మేటి ప్రతిభను కనబరుస్తూ భారత్కు వచ్చి పెట్టుబడులు పెడితే.. ప్రోత్సాహం సంగతి అటుంచి.. భారత్కు వచ్చినందుకు చింతించే పరిస్థితులు కల్పిస్తున్నారంటూ ఇటీవలి కాలంలో విదేశాల నుంచి వచ్చి భారత్లో పెట్టుబడులు పెట్టిన వారు తీవ్ర ఆందోళనకు గురువుతున్న సంగతి తెలిసిందే. వారు దీనిని సోషల్ మీడియా వేదికగా తన నిరసనను బహిర్గతం చేస్తున్నారు. షోషల్ మీడియాలో వివిధ వేదికలపై వీరు నడుపుతున్న గ్రూపులకు అనూహ్యంగా మద్దతు పెరుగుతూ తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మోడీ సర్కారు మంగళవారం కీలక నిర్ణయాన్ని వెల్లడించడం విశేషం.