Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం...
న్యూఢిల్లీ : నిర్మాణంలో ఉన్న నివాస గహాలపై జీఎస్టీని తగ్గిస్తూ ఆదివారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో గృహ కొనుగోలుదారులకు జీఎస్టీ నుంచి స్వల్ప ఊరట కలుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ నిర్ణయం ఈ ఏడాడి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. వ్యవసాయంలో ఆదాయంలేక, ఉద్యోగాలులేక మోడీ సర్కారుపై వ్యతిరేకతను అధిగమించే వ్యూహంలో భాగంగానే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేలా ఈ నిర్ణయం తీసుకున్నదని విశ్లేషకుల అభిప్రాయం. నిర్మాణంలో ఉన్న నివాస గృహాలపై ఇప్పటివరకు 12 శాతం జీఎస్టీ ఉండేది. దీన్ని 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే రూ.45 లక్షలలోపు గృహాల కొనుగోలుపై జీఎస్టీ 1 శాతానికి తగ్గించారు. ఇంతకు ముందు ఇది 8 శాతంగా ఉండేది. సరసమైన గృహాల(అఫర్డబుల్ హౌజింగ్)కు జీఎస్టీ కౌన్సిల్ సరికొత్త నిర్వచనం ఇచ్చింది. మెట్రో నగరాల(న్యూఢిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్)లో 60 చదరపుమీటర్లు లేదా అంతకంటే తక్కువ ప్రాంతంలో నిర్మించిన గృహాలను ఇక నుంచి సరసమైన గృహాలుగా అభివర్ణిస్తారు. అదేవిధంగా నాన్-మెట్రో నగరాల్లో 90 చదరపు మీటర్లు లేదా అంతకంటే తక్కువ స్థలంలో నిర్మించిన గృహాలను సరసమైన గృహాలుగా పేర్కొంటారు. నూతనంగా తీసుకున్న నిర్ణయాలు నిర్మాణ రంగానికి ప్రోత్సాహకరంగా ఉంటాయని భావిస్తున్నట్లు అరుణ్ జైట్లీ తెలిపారు.