Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 ఏండ్ల గడువుతో కాంట్రాక్టు
- పీపీపీ పేరుతో అప్పగింత
- పెండింగ్లో మరొక బిడ్
న్యూఢిల్లీ : ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు, వ్యాపార మిత్రుడు గౌతమ్ అదానికి కేంద్రం ఏకంగా ఐదు విమానాశ్రయాల ఆధునీకరణ, నిర్వహణను కట్టబెట్టింది. మొత్తం ఆరింటికి బిడ్లను అహ్వానించగా.. ఐదు కూడా అదానీ గ్రూపునకు దక్కాయని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వెల్లడించింది. దీనికి సంబంధించిన బిడ్లను సోమవారం తెరిచారని ఏఏఐ వర్గాలు తెలిపాయి. దీంతో ఇప్పటివరకు ప్రభుత్వరంగంలోని ఏఏఐ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ విమానాశ్రయాలు ఇకపై ప్రయివేటుపరం కానున్నాయి. ఈ దెబ్బతో ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. అదానీ గ్రూపు ఆరు విమానాశ్రయాలకు బిడ్లను వేసిందని సమాచారం. 50 ఏండ్ల కాలపరిమితితో ఈ ఎయిర్పోర్టుల ఆధునీకరణ, నిర్వహణను చేపట్టాల్సి ఉంటుంది. లక్నో, జైపూర్, అహ్మదాబాద్, మంగళూరు, త్రివేండిం ఎయిర్పోర్టులు అదాని దక్కించుకున్నారు. మరో ఎయిర్పోర్టు గువహతి కోసం కూడా బిడ్ను వేసినప్పటికీ.. ఆ బిడ్ ఇప్పటివరకు తెరువలేదని ఎయిర్పోర్టు అథారిటీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక్కడి విమానాశ్రయ ప్రయివేటీకరణను నిలిపివేయాలని కోర్టులో దావా వేయడంతో దీనిపై గువహతి హైకోర్టు స్టే విధించింది. దీంతో ఈ బిడ్ను ప్రకటించలేదు.
ఇంత పెద్దమొత్తంలో ఒకేసారి ప్రాజెక్టులు రావడంతో అదానీ గ్రూపు విమానయాన రంగంలోకి ప్రవేశించినట్లయ్యింది. ముంబయి ఎయిర్పోర్టును నిర్వహిస్తున్న జీవీకేలో వాటా కొనుగోలుకు అదానీ గ్రూపు చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. నెెలసరి ప్యాసింజర్ రుసం (మంత్లీ పర్ పాసెంజర్ ఫీ) పద్ధతిలో ఈ ప్రాజెక్టులను అప్పగించినట్టు ఏఏఐ వెల్లడించింది. ఏఏఐ ప్రతిపాదించిన రుసుం కంటే తక్కువ వసూలు చేయడానికి ఆసక్తి చూపిన వారికి అవకాశం కల్పించినట్టు ఏఏఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఢిల్లీ, ముంబయి, బెంగళూరులోని ప్రస్తుత ప్రయివేటు విమానాశ్రయాల్లో అమల్లో ఉన్న రెవెన్యూ షేరింగ్ను కొనసాగించనున్నారు. అదానీ గ్రూపు ఈ ప్రాజెక్టుల కోసం అత్యంత 'అగ్రెసివ్ బిడ్డింగ్'ను వేసిందని ఓ అధికారి తెలిపారు. కొన్ని లాంఛనాలు పూర్తైన తర్వాత ఈ ఐదు ఎయిర్పోర్టులను అదానీ గ్రూపునకు అప్పగించనున్నట్టు ఏఏఐ అదికారి తెలిపారు.
గతేడాదిలోనే బీజం..
ఈ ఆరు విమానాశ్రయాల కోసం ఏఏఐ యాజమాన్యం 10 కంపెనీల నుంచి 32 టెక్నికల్ బిడ్లను పొందింది. గతేడాది నవంబర్లో వీటిని ప్రయివేటీకరించడానికి మోడీ సర్కారు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అహ్మదాబాద్, జైపూర్ ఎయిర్పోర్టుల కోసం ఏడు చొప్పున బిడ్లు వచ్చాయి. లక్నో, గువహతి కోసం ఆరు చొప్పున బిడ్లు, మంగళూరు, త్రివేండిం కోసం మూడు చొప్పున బిడ్లు నమోదయ్యాయి. అదానీ గ్రూపుతో పాటు జీఎంఆర్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్), ఫెయిర్ఫాక్స్ ఇండియా హోల్డింగ్ కార్పొరేషన్. ఆస్ట్రేలియా ఏఎంపి కాపిటల్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్, కేరళ స్టేట్ ఇండిస్టీయల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేఎస్ఐడీసీ) తదితర కంపెనీలు ఈ బిడ్డింగ్లో పాల్గొన్నాయి. ఆరు విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ)లో నిర్వహించనున్నట్లు ఏఏఐ వర్గాలు తెలిపాయి.