Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎస్బీలకు సర్కారు సాయం సరిపోదు
- రూ.48వేల కోట్లు ఆర్థిక దన్నునివ్వలేదు:ఫిచ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు(పీఎస్బీ) కేంద్ర ప్రభుత్వం అందించనున్న రూ.48,000 కోట్ల మూలధనీకరణ సాయం వాటి అవసరాలకు సరిపోదని ప్రముఖ రేటింగ్ ఎజెన్సీ ఫిచ్ విశ్లేషించింది. పటిష్ట రుణాల వృద్ధికి ఈ మొత్తం మద్దతును ఇవ్వలేదని పేర్కొంది. 2019లో బ్యాంకులకు అదనంగా మరో రూ.1.6 లక్షల కోట్లు (23 బిలియన్ డాలర్లు) అవసరం అవుతాయని అంచనా వేసింది. అప్పుడే కనీస పెట్టుబడి ప్రమాణాలను చేరుకోగలవని సూచించింది. గత కొన్ని నెలలుగా రుణాలకు డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు రోజుల్లో మరింత పెట్టుబడులు అవసరం అవుతాయని పేర్కొంది. ఫిచ్ రిపోర్టు ప్రకారం ఫిబ్రవరి 21న డజన్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.48,239 కోట్ల మూలధనం అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మొత్తంలో బ్యాంకులు వేగమైన వృద్ధిని నమోదు చేయలేవు. మరింత మొత్తం కావాలి. పలు బ్యాంకులు ఇప్పటికే తీవ్ర మొండి బాకీల బెడదను ఎదుర్కొంటున్నాయి. అదే విధంగా నిరర్ధక ఆస్తులు పరిష్కారం నెమ్మదిగా కొనసాగుతుంది. బేసల్ 3 పెట్టుబడి కనీస నిబంధనలను చేరాలంటే పీఎస్బీలకు ప్రస్తుత ఏడాదిలోనే మరో 23 బిలియన్ డాలర్ల మూలధనం సమకూర్చాల్సిన అవసరం ఉందని తాము అంచనా వేశామని ఫిచ్ పేర్కొంది. 2017 సెప్టెంబర్లో పీఎస్బీలకు తాము రూ.4 లక్షల కోట్లు కావాలని అంచనా వేశామని.. ప్రస్తుతం ఈ అంచనాలను తగ్గించామన్నారు. రుణాల వృద్ధి రేటులో పెద్ద మెరుగుదల లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంది. భారత బ్యాంకింగ్ రంగంపై ఫిచ్ ప్రతికూల రేటింగ్ను ఇచ్చింది.
కార్పొరేషన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంకులు ఆర్బిఐ పీసీఏ జాబితాలో ఉన్నప్పటికీ వాటికి కేంద్రం మూలధనం కేటాయించడం విశేషం. ఈ జాబితాలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లకు కూడా కలిపి రూ.12,535కోట్లు మూలధనం అందించనున్నట్లు ప్రకటించింది. కార్పొరేషన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు మంచి ప్రగతిని కనబర్చుతున్న వాటిలో ముందు వరసలో ఉన్నాయి. గతేడాది డిసెంబరులో కూడా 7 పీఎస్బీలకు రూ. 28,615కోట్ల మూలధనం సమకూర్చింది. కార్పొరేషన్ బ్యాంక్కు రూ.9,806 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ రూ.6,896 కోట్లు, బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.4,638 కోట్లు, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర రూ.205 కోట్లు, పీఎన్బీ రూ.5,908 కోట్లు, యూనియన్ బ్యాంకు రూ.4,112 కోట్లు, ఆంధ్రా బ్యాంకు రూ.3,256 కోట్లు, సిండికేట్ బ్యాంకు రూ.1,603 కోట్ల చొప్పున మూలధనం అందించడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.