Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెట్ ఎయిర్వేస్కు పూర్వవైభవమే లక్ష్యం
- గత 25 ఏండ్లుగా సంస్థ కోసం పనిచేశా
- రానున్న రోజుల్లోనూ అదే దిశగా కృషిచేస్తా
- ఉద్యోగులకు చైర్మెన్ నరేశ్ గోయల్ లేఖ
న్యూఢిల్లీ: తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్వేస్ను నిలబెట్టేందుకు గాను తాను ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనని ఆ సంస్థ చైర్మెన్ నరేశ్ గోయల్ తెలిపారు. జెట్ ఎయిర్వేస్ను తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు గాను తాము ఎలాంటి చర్యకైనా సిద్ధమేనని ఆయన ఉద్యోగులకు రాసిన ఒక లేఖలో వెల్లడించారు. సంస్థను తిరిగి సుసంపన్నమైన విమానయాన సంస్థగా నిలిపేందుకు గాను అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నానని.. ఇందులో భాంగంగా రుణ దాతలతో తాము ఒక అభిప్రాయానికి వచ్చామని.. ఈ రుణవితరణ దారులతో చేసుకున్న తీర్మానం గురించిన పూర్తి వివరాలను ఈ నెల 18 లోపు సమగ్రంగా అన్ని వివరాలతో బహిర్గతం చేస్తానని ఆయన అన్నారు. జెట్ ఎయిర్వేస్ను నిలబెట్టే విషయమై ఇతిహాద్ ఎయిర్వెస్ చీఫ్తో కలిసి జెట్ ఎయిర్వేస్ సంస్థ గోయెల్ ప్రకటన చేయడం ఈ వారంలో రెండోసారి కావడం విశేషం. సంస్థను ఆర్థికంగా నిలబెట్టే ప్రక్రియలో భాగంగా పలు కీలక అడుగులు వేయాల్సి ఉందని.. కొన్ని అంశాలకు సంబంధించిన అనుమతులూ రావాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ కీలక పరిణామాల నుంచి బయటకు వచ్చే విషయమై తాను వ్యక్తిగతంగా ఎంత వీలైతే అంత వరకు త్యాగానికైనా సిద్ధపడుతూ ముందుకు సాగుతున్నామన్నారు. గడిచిన 25 సంవత్సరాలుగా సంస్థను నిలబెట్టే ప్రయత్నంలో తన జీవితాన్ని దారపోసానని అన్నారు. ఫలితంగా జెట్ ఎయిర్వేస్ సంస్థలో ఉద్యోగులు అనుకున్న స్థాయికంటే మెరుగైన స్థాయిలో ఉన్నారని ఆయన అన్నారు. కఠిన సమయంలో తాను జెట్ ఎయిర్వేస్ను నిలబెట్టడమే కాకుండా పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి భారతీయుల మొదటి విమానయాన చాయిస్గా జెట్ ఎయిర్వేస్ను నిలిపేందుకు కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు.