Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ 'సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' నిరర్థక ఆస్తులను తగ్గించుకొనేందుకు గాను అనూహ్య నిర్ణయం తీసుకుంది. రూ. 3,300 కోట్ల విలువైన నిరర్థక ఆస్తులను 'సర్ఫేసి' చట్టం కింద వేలానికి వేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. వీటిలో ముఖ్యంగా నాలుగు ఖాతాలకు చెందిన నిరర్థక ఆస్తులున్నాయని బ్యాంకు తెలిపింది. ఇందులో బాంబే రేయాన్ ఫ్యాషన్స్, అలోక్ ఇండిస్టీస్ (రూ.1,251 కోట్లు), భూషణ్ పవర్ అండ్ స్టీల్ (రూ.1,550.07 కోట్లు), ఎస్సార్ స్టీల్కు (రూ.423 కోట్లు) చెందిన విలువైన నిరర్థక ఆస్తులు ఉన్నట్లు వివరించింది. అయితే ఒక్క బాంబే రేయాన్ ఫ్యాషన్స్ తప్ప మిగతా మూడు కంపెనీలు ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రైబ్యూనల్) పరిధిలో ఉన్నాయని వెల్లడించింది. బ్యాంకు పాలసీ, రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఆస్తులు అమ్మకం జరుగుతుంది అని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. వీటిని బ్యాంకులు, ఏఆర్స ీ(అసెంట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు), ఎన్బీఎఫ్సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) షరతులకు లోబడి కొనుగోలు చేయవచ్చని బ్యాంక్ వెల్లడించింది. అయితే ఈ ఆస్తుల వేలానికి ఇంకా బ్యాంకు అథారిటీ ఆమోదం తెలపాల్సి ఉంది అని బ్యాంకు ఒక నోటిసులో తెలిపింది. వేలంలో పాల్గొనే వారు మార్చి 20లోపు బిడ్లను దాఖలు చేయాలని సూచించింది. సెంట్రల్ బ్యాంక్ చర్యతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు భారీగా ఎగవేతలు ఉన్న వారి వెన్నులో జంకు మొదలైంది. బకాయిల వసూళ్లకు రానున్న రోజుల్లో మిగతా బ్యాంకింగ్ సంస్థలు కూడా ఇలాంటి భారీ వేలానికి దిగే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు. ఇదే జరిగితే తాము ఆర్థికంగా కుంగిపోవాల్సి వస్తుందన్న భావన వారిలో కనిపిస్తోంది. ఆర్బీఐ ఇస్తున్న ఆదేశాల మేరకే బ్యాంకింగ్ సంస్థలు తన దూకుడును ప్రదర్శిస్తూ వస్తున్నాయి.