Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు స్వాగతించదగినవేనని హీరో ఎలక్ట్రిక్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ ముంజాల్ అన్నారు. 'ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్ఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్-2' (ఫేమ్-2) పథకం కింద వ్యయాలకు రూ.10 వేల కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే, కేవలం బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా రాయితీ ఇస్తామంటే సరిపోదని వ్యాఖ్యానించారు. దీని వల్ల ద్విచక్ర వాహనాల రేట్లు పెరుగుతాయని అన్నారు. ''ఈ పథకం కింద వాహనాలకు రాయితీ పూర్తిగా బ్యాటరీ సామర్థ్యం ఆధారంగానే ఇవ్వనున్నారు. బ్యాటరీ తయారీకి అయ్యే ఖర్చును లెక్కించడం ద్వారా ఆ మొత్తాన్ని వినియోగదారుడికి అందిస్తారు. అది సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం. నగరాల్లో వాహనాల గరిష్ట వేగం సగటున గంటకు 30-35 కి.మీ. మించదు. రోజు మొత్తం మీద 30-40కి.మీ.లకు మించి కూడా ఎవరూ ప్రయాణించరు.. అలాంటప్పుడు అతి పెద్ద బ్యాటరీల అవసరం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి రాయితీ వల్ల వచ్చే ప్రయోజనం చాలా తక్కువ. ప్రస్తుతం వస్తున్న రాయితీలో సగానికి సగం తగ్గిపోతుంది'' అని ముంజాల్ విశ్లేషించారు. ఈ నేపథ్యంలో సర్కారు నిర్ణయం సరైంది కాదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఫేమ్-2 పథకాన్ని ఏప్రిల్ 1, 2019 నుంచి మూడేళ్ల పాటు అమలు చేయనున్నారు.