Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో తయారీ రంగపు ఉత్పాదకతను పెంచాలంటే భూసేకరణ, కార్మిక, ఆర్థిక రంగాల్లో మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్ అభిప్రాయపడ్డారు. దేశం వృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ఈ కీలక రంగాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. రాయిటర్స్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారత్లో ప్రయివేటు సంస్థల ఏర్పాటుకు గాను భూసేకరణ, కాలం చెల్లిన పాత కార్మిక నిబంధనలు, రుణాల సేకరణ ఖర్చు ఎక్కువ మొత్తంలో ఉండడం వల్లే ఎక్కువ మంది ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు వెనుకడుగు వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రతికూలతల కారణంగానే కొత్త పరిశ్రమలు వియత్నాం, థారులాండ్, బాంగ్లాదేశ్లకు తరలి వెళ్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆయా దేశాల్లో ఆకర్షణీయమైన విధానాలు అమలులో ఉన్నాయని ఆయన వివరించారు. ప్రతికూల పరిస్థితుల కారణంగానే ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం వాటా 1.5 శాతం పెరిగి 18 శాతానికి చేరిందని.. గడిచిన ఐదేండ్ల కాలంలో వస్తువుల ఎగుమతులు కూడా స్వల్ప వృద్ధినే కనబరచడాన్ని ఆయన ఈ ఇంటర్వ్యూలో ఉదహరించారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఆధికారంలోకి రానున్న కొత్త సర్కారైనా సంస్కరణల వేగాన్ని పెంచాలని ఆయన అన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ విద్యార్థి అయిన సుబ్రహ్నణ్యన్ గత డిసెంబరులో ప్రధాని మోడీ ప్రధాన ఆర్థిక సలహాదారు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి మోడీ సంస్కరణల పర్వంలో కొంత వేగం పెంచినప్పటికీ వివిధ కారణాల వల్ల అనుకున్న స్థాయిలో ముందుకు సాగట్లేదని ఆయన విశ్లేషించారు. దీనికి భిన్నంగా రానున్న కొత్త సర్కారు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.