Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిస్క్టీమ్ వద్దన్నా 2400 కోట్ల రుణాలు
- పది పెద్ద లావాదేవీలతో భారీ నష్టాలు..:
- ఆడిట్ సంస్థ గ్రాంట్ థోర్న్టన్ వెల్లడి
న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందుల్లోకి జారుకున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థలో దాదాపు రూ.13,000 కోట్ల విలువైన భారీ అవకతవకలు జరిగినట్టుగా ఆడిట్ సంస్థ గ్రాంట్ థోర్న్టన్ వెల్లడించింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థకు సంబంధించి జరిపిన ప్రత్యేక ఆడిట్లో తాము ఈ అవకతవకలను గమనించినట్టుగా ఆడిట్ సంస్థ వెల్లడించింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూపు సంస్థ 24 ప్రత్యక్ష అనుబంధ కంపెనీలను, 135 పరోక్ష అనుబంధ సంస్థలను, ఆరు ఉమ్మడి వెంచర్ సంస్థలను నాలుగు అసోసియేటడ్ కంపెనీలను నడుపుతున్న విషయం తెలిసిందే. పరోక్ష పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంస్థ తాజాగా దాదాపు రూ.94,000 కోట్ల విలువైన రుణ భారాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు సంబంధించిన కంపెనీలు రుణ గ్రహీతలకు చెల్లించాల్సిన సొమ్మును ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థకు తరలించిన ఉదంతాలు కూడా తమ పరిశీలనలో వెలుగులోకి వచ్చినట్టుగా ఆడిట్ సంస్థ తెలిపింది. ఇలా మొత్తం 29 కేసులను తాము గుర్తించామని వెల్లడించింది. వీటి మొత్తం విలువ దాదాపు రూ.2,502 కోట్ల వరకు ఉంటుందని ఆడిట్ సంస్థ తన ముసాయిదా నివేదికలో లెక్క తేల్చింది. 2013 ఏప్రిల్ నుంచి మొదలుకొని గత ఏడాది (2018) సెప్టెంబరు మధ్య కాలానికి జరిగిన లావాదేవీలను ఆడిట్ చేసిన సంస్థ ఈ అవకతవకల వివరాలను వెల్లడించింది. రుణ రికార్డులు సరిగ్గాలేదని రిస్క్టీమ్ తెల్చిన సంస్థకు కూడా గ్రూపు సంస్థ దాదాపు రూ.2400 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసినట్టుగా ఆడిట్ పరిశీలనలో తేలింది. మొత్తంగా ఇలాంటి 10 భారీ ప్రధాన మోసాలను తాము గర్తించినట్టుగా సంస్థ వివరించింది. వీటి విలువ దాదాపు రూ.13,290 కోట్ల దరిదాపుల్లో ఉంటుందని పేర్కొంది.