Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు పడిపోతున్న తరుణంలో ప్రభుత్వం వినూత్న నిర్ణయాన్ని ప్రకటించింది. జీఎస్టీ వసూళ్లకు కార్పొరేట్ పన్నుకు లంకె పెట్టింది. రానున్న రోజుల్లో జీఎస్టీ వసూళ్లు మెరుగుపడితే దేశంలోని అన్ని కంపెనీలకు కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని 'ఫిక్కీ'(ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ) అధ్యక్షుడు సందీప్ సోమానీ తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మంగళవారం వివిధ అంశాలపై జరిగిన సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కంపెనీలపై పన్నుల విధింపు, ఉద్యోగ కల్పన, పరిశ్రమల ఉత్పాదకత పెంచటం వంటి అంశాలపై ముఖ్యంగా చర్చలు జరిగాయన్నారు. జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయని.. రానున్న కాలంలో కార్పొరేటు రంగంలో విధిస్తున్న పన్నులను సరళీకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు. టర్కీ, ఇండియాలకు అమెరికా ప్రాధాన్యత వాణిజ్య హౌదాను తీసివేస్తున్నట్లు ప్రకటించడంపై ఆయన స్పందించారు. ప్రభుత్వం దీనికి సంబంధించి సరైన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.