Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయంగా విమాన టిక్కెట్ల ధరలు భగ్గుమంటున్నాయి. వివిధ కారణాల వల్ల విమాయనయానానికి డిమాండ్ పెరగడంతో ఆయా ఎయిర్లైన్స్ సంస్థలు టిక్కెట్ల ధరలను భారీగా పెంచేస్తున్నాయి. కొన్ని రూట్లలో ధరలను గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే దాదాపు 300 నుంచి 400 శాతం పెరిగిపోయినట్టుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వరుస విమాన ప్రమాదాల నేపథ్యంలో భారత్ బోయింగ్ 737 మాక్స్ 8 మోడల్ విమానాల సర్వీసులను రద్దు చేయడం, జెట్ విమాన సంస్థ వివిధ ఇబ్బందుల కారణంగా సర్వీసులను రద్దు చేస్తుండడంతో పాటు ఉత్తరాది పెద్ద పండుగ అయిన హౌలి నేపథ్యంలో దేశీయంగా విమానయానానికి డిమాండ్ అమాంతం పెరిగిపోతోంది. చాలా రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో వేసవి రద్దీ కూడా విమాన ప్రయాణాలపై ప్రభావం చూపుతోంది. దీంతో అఖరి నిమిషం బుకింగ్ల ధరలు దాదాపు 100 శాతం నుంచి 400 శాతం మేర పెరిగాయి. ప్రధానంగా ఢిల్లీ-ముంబయి, ముంబయి- చెన్నై, ముంబయి-కోల్కతా, ముంబయి-బెంగళూరు, ఢిల్లీ-హైదరాబాద్, హైదరాబాద్ -ముంబయి మార్గాల్లో డిమాండ్ అత్యధికంగా నమోదు అవుతోందని విమాన సంస్థల బుకింగ్ సిబ్బంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డిమాండ్ను క్యాష్ చేసుకొనేందుకు గాను విమాన సంస్థలు రికార్డు స్థాయిలో ధరలను పెంచేస్తున్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు అత్యవసర ప్రయాణాల కోసం చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితి రానున్న 20 నుంచి నెల రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ట్రావెల్ ఏజెంట్ సంస్థలు చెబుతున్నాయి.