Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గడువుకు ఒక్కరోజు ముందు బకాయిల చెల్లింపు..
- జైలుకు వెళ్లాల్సి వస్తుందని బకాయి తీర్చేసిన అంబానీ
- ఆర్కాం కేసులో స్వీడిష్ సంస్థదే అంతిమ విజయం
- సుదీర్ఘపోరులో న్యాయం గెలిచిందంటున్న విశ్లేషకులు
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యునికేషన్స్(ఆర్కాం) నుంచి బకాయిలను వసూలు చేసుకొనే విషయంలో స్వీడిష్ టెలికాం కంపెనీ ఎరిక్సన్ ఎట్టకేలకే విజయం సాధించింది. అనిల్ అంబానీకి చెందిన ఆర్కాం నుంచి సంస్థకు రావాల్సిన బకాయిలను సాధించే విషయమై సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన ఎరిక్సన్ సంస్థ సోమవారంతో విజయం సాధించినట్టయింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మార్చి 19లోపు ఆర్కాం సంస్థ స్వీడిష్ కంపెనీకి రూ.458.77 కోట్లు చెల్లించాల్సి ఉంది. లేదంటే అనిల్ అంబానీని ఆరెస్ట్ చేయాలంటూ పెద్దకోర్టు సీరియస్గా ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. గడువు ముగిసేందుకు కొన్ని గంటల ముందు అనిల్ అంబానీ సంస్థ చెల్లింపు ప్రకియను పూర్తి చేసింది. గడువులోపే స్వీడిష్ కంపెనీ ఎరిక్సన్కు రూ.458.77 కోట్లు చెల్లించామని కంపెనీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఎరిక్సన్కు చెల్లింపుల ప్రక్రియ పూర్తయినట్టుగా వివరించింది. ఒకవేళ చెల్లింపుల్లో ఆలస్యం జరిగినట్లయితే అనిల్ అంబానీ మూడు నెలలు కారాగారాన్ని అనుభవించాల్సి వచ్చేది. తాజా పరిణామంతో రెండు కంపెనీల మధ్య సంవత్సర కాలంగా కొనసాగుతోన్న న్యాయపోరాటానికి తెరపడినట్టయింది.
పట్టువదలక పోరాడిన ఎరిక్సన్..
ఎరిక్సన్కు చెల్లించాల్సిన బకాయిలను వాయిదా వేసేందుకు, వీలైతే పూర్తిగా ఎగ్గొట్టే దిశగా అనిల్ అంబానీ సంస్థ శతవిధాలా ప్రయత్నంచినప్పటికీ ఎరిక్సన్ పట్టువదలకుండా ఎంతగానే పోరాడిందని అందుకే ఆ సంస్థ విజయం సాధించగలిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. సుప్రీం కోర్టుకు తమ డిమాండ్ న్యాయమైందేనని చెప్పే విషయంలో ఆ సంస్థ ఎంత మెరుగ్గా వాదించిందని.. నేర్పుగా వారికి జరిగిన అన్యాయాన్ని కోర్టుకు సరిగ్గా ప్రజెంట్ చేయగలిగింది అని వారంటున్నారు. దీంతో అనిల్ అంబానీకి చుక్కలు కనిపించాయి. ఈ విషయమై పలు మార్లు కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అంబానీ సంస్థలు లైట్ తీసుకున్నాయి. దీనికి సీరియస్ అయిన కోర్టు 2018 డిసెంబర్ 15లోగా బకాయిలను చెల్లించవలసిందిగా గత అక్టోబర్ 23న కోర్టు అనిల్ ధీరూభారు అంబానీ గ్రూప్(అడాగ్) సంసను ఆదేశించింది. ఆలస్యం చేస్తే 12 శాతం వార్షిక వడ్డీతో చెల్లింపులు చేపట్టవలసి ఉంటుందని హెచ్చరించింది. అయినా బకాయిలు చెల్లించకపోవడంతో అనిల్ అంబానీని కోర్టు ధిక్కరణ కింద జైలుకు పంపాలనీ, విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలంటూ ఎరిక్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మొత్తం రూ.550కోట్లను చెల్లించాల్సిందిగా అనిల్ అంబానీకి ఆదేశాలు జారీ చేయమంటూ కోర్టును అభ్యర్థించింది. దీన్ని విచారించిన సుప్రీం రూ. 550 కోట్ల బకాయిలను చెల్లించే ఉద్దేశం ఆర్కాంకు లేదని సుప్రీంకోర్టు ఆగ్ర హం వ్యక్తం చేసింది. నాలుగువారాలలో ఎరిక్సన్ ఇండియాకు రూ.453 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాల్లో ఇచ్చిన గడువు మంగళవారంతో (19 మార్చితో) ముగిసిపోనుండడంతో.. జైలుకు వెళ్లడాన్ని తప్పించుకొనేందుకు గాను ఒక్క రోజు ముందుగా అనిల్ అంబానీ బకాయిల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేశారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో టెలికాం వ్యాపారంలో బాగా నష్టపోయిన ఆర్కాం సంస్థ అంతకు ముందు చేసుకున్న ఒప్పందం మేరకు బకాయిలను చెల్లించే విషయంలో జాప్యం చేస్తూ వచ్చింది. బకాయి మొత్తాన్ని చెల్లిస్తామంటూ పలుమార్లు ప్రకటనలు చేస్తూ వచ్చినప్పటికీ.. ఆ దిశగా చర్యలు ప్రారంభించ లేదు. రిలయన్స్ జియోకు ఆస్తులను విక్రయించడం ద్వారా నిధులను సమీకరించి బాకీలను తీర్చేస్తామని తెలిపింది. అయితే ఆస్తుల విక్రయంలో విఫలంకావడంతో నిధుల కొరత కారణంగా ఎరిక్సన్కు చెల్లింపులను చేయలేకపోయానని అనిల్ అంబానీకి కోర్టుకు తెలిపారు. ఇతర టెలికాం ఆస్తుల అమ్మకానికి అనుమతినిస్తే తాము బకాయిలు చెల్లిస్తామంటూ కోర్టుకు తెలిపారు. దీనికీ కోర్టు అంగీకరించలేదు. మరోసారి తమకు ఆదాయపు పన్ను శాఖ నుంచి రావాల్సిన సొమ్మును ఎరిక్సన్ బాకీలను చెల్లించేందుకు అనుమతించాలని కోరింది. దీనికి ఇతర రుణ దాతల నుంచి ఒత్తిడి రావడంతో కోర్టు ఈ ప్రతిపాదనను పక్కనబెట్టింది. కోర్టు ధిక్కరణను తప్పించుకొనేందుకు న్యాయస్థానం ఆదేశాలనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్టుగా కూడా ఆర్కాంపై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై సీనియర్ కోర్టు సిబ్బందిపై సుప్రీం వేటు వేసిన సంగతి తెలిసిందే.