Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీఐకి తేల్చి చెప్పిన ప్రముఖ ఆర్థికవేత్తలు
- వృద్ధిలో మందగమనంపై తీవ్ర అసంతృప్తి
- వరుసగా రెండోసారి రెపోరేటు తగ్గించొచ్చు.
- ఆర్థికానికి ఊతమిచ్చే పలు చర్యలు తీసుకోండి:
- ఆర్బీఐ గవర్నర్కు ప్రముఖ ఆర్థికవేత్తల సూచన
ముంబయి: దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పలువురు ప్రముఖ ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన దాదాపు డజను కంటే ఎక్కువ మంది ప్రముఖ ఆర్థికవేత్తలు, విధానకర్తలు దేశ ఆర్థిక వ్యవస్థలో వేగంగా నమోదవుతున్న మందగమన పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. వచ్చే నెల 4వ తేదీని పరపతి విధాన సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో.. భవిష్యత్తు కార్యాచరణపై సలహాలను కోరేందుకు గాను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్దాస్ మంగళవారం ఆర్థికవేత్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న అత్యధిక మంది ఆర్థికవేత్తలు దేశ వృద్ధిరేటుకు దన్ను నిచ్చేలా పరపతి విధానం ఉండాలని సూచించారు. దేశంలో ఆర్థిక విస్తరణకు అవకాశం లేని నేపథ్యంలో పరపతి విధానంలోనే ఈ దిశగా చర్యలు చేపట్టాలని వారు సూచించినట్టు సమాచారం. భారత ఆర్థిక వ్యవస్థ అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య కాలంలో కేవలం 6.6 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసింది. అంతకు ముందు ఐదు త్రైమాసికాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు రెండోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు భారీ వ్యూహంతో ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో దేశ వృద్ధిరేటు ఐదు నెలల కనిష్టానికి చేరడం అటు ప్రభుత్వానికి.. ఇటు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వృద్ధిలో మందగమన పరిస్థితుల కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఆదాయం రావడం లేదు. దీంతో ఎన్నికల వేళ ప్రజాకర్షణ పొందేందుకు భారీగా నిధులను ఖర్చుచేద్దామని ఆశ పడిన మోడీ సర్కారు చుక్కెదురవుతోంది. అయితే ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా వడ్డీరేట్లను తగ్గించాలని తాము ఆర్బీఐని కోరలేదని.. కాకపోతే వృద్ధికి దన్నునిచ్చేలా పలు సర్కారు చర్యలను ప్రారంభిస్తే మేలని తాము సూచించామని వారు చెబుతున్నారు.
మరోసారి రెపోరేటు తగ్గింపు..
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ వచ్చే పరపతి విధాన సమీక్షలో వరుసగా రెండోసారీ రెపోరేటును మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించి 6.00 శాతానికే పరిమితం చేసే అవకాశం ఉన్నట్టు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే రెపోరేటును ఎంత మేరకు తగ్గించే అవకాశం ఉందన్న విషయంలో వారు స్పష్టమైన నిర్ణయానికి వెల్లడించలేదు. వీరిలో ఒక ఆర్థికవేత్త మాట్లాడుతూ ఈ సారి ఆర్బీఐ రెపోరేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్థికవేత్తలతో దేశ పెద్ద బ్యాంక్ గవర్నర్ దాస్ సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి ఆర్బీఐ ఎలాంటి విషయాలను బయటకు వెల్లడించలేదు. ఈ సమావేశంలో వ్యూహకర్తలు, ఆర్థికవేత్తలు దేశంలో కరువు, నగదు నిర్వహణ, ఎక్స్ఛేంజీ రేట్లు, ద్రవ్యోల్బణం, బ్యాంక్ రుణ వితరణ వృద్ధి, వాస్తవ వడ్డీరేట్లుతో పాటు పరపతి విధాన పరివర్తన విషయమై ఆర్థికవేత్తలు తమ అభిప్రాయాలను దాస్తో పంచుకున్నట్టుగా సమాచారం. దాదాపు ఈ సమావేశం రెండున్నర గంటలపాటు జరిగింది. దేశంలో విస్తారంగా వర్షాలు కురవకపోతే సెప్టెంబరు తరువాత దేశంలో కరువు పరిస్థితులు తాండవమాడే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డట్టుగా సమాచారం.