Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైండ్ ట్రీ సంస్థ బలవంతపు టేకోవర్..!
- ఐటీ సంస్థపై కన్నెసిన ఎల్ అండ్ టీ
- వ్యూహాత్మకంగా వాటాల కొనుగోలు..
- అడ్డుకొనే ప్రయత్నాలలో ప్రమోటర్లు
- కలిసిరాని నియంత్రణ నిబంధనలు..
నవతెలంగాణ, వాణిజ్య విభాగం:
చిన్న చేపలను పెద్ద చేపలు మింగేయడం మనకు తెలిసిన విషయమే.. అయితే తాజాగా దేశీయ వ్యాపార రంగంలోనూ ఇలాంటి సంఘటన జరుగుతోంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు కష్టపడి మార్కెట్లో నిలదొక్కుకుంటూ వృద్ధి పథంలో దూసుకుపోతున్న మధ్య తరహా ఐటీ సంస్థ మైండ్ట్రీని బలవంతంగా టేకోవర్ చేసే దిశగా దేశంలోని ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ వేగంగా పావులు కుదుపుతోంది. ఈ నేపథ్యంలో ఒక దిగ్గజ కంపెనీపై ఓ చిన్న కంపెనీ పోరాటానికి సిద్ధమైంది. అయితే ఆ సంస్థ ప్రమోటర్లు చేస్తున్న పోరాటం ఎక్కువ కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఒకప్పుడు బలవంతపు టేకోవర్ బారిన పడి బయటపడ్డ కంపెనీయే ఇపుడు బలవంతపు టేకోవర్కు పూనుకోవడం విశేషం.
ఎల్ అండ్ టీ బలవంతపు టేకోవర్ ప్రయత్నాలపై మైండ్ ట్రీ ప్రమోటర్లు తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తున్నారు. మైండ్ ట్రీ ప్రమోటర్లయిన కృష్ణకుమార్ నటరాజన్ (ఎగ్జిక్యూటివ్ చైర్మెన్), సుబ్రతో బాగ్చి (సహ-వ్యవస్థాపకుడు), రోస్తో రావణన్(సీఈఓ), పార్థ సారథి ఎన్.ఎస్.(ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మెన్, సీఓఓ)లు ఎల్ అండ్ టీ తీరును బాహాటంగా విమర్శించారు. ఎల్ అండ్ టీ సంస్థ రూ.1,20,000 కోట్ల టర్నోవరును కలిగి ఉందనిమైండ్ ట్రీ కంటే పరిమాణంతో పోలిస్తే ఇది 18 రెట్లు ఎక్కువని వారు తెలిపారు. అపారమైన వనరులున్న ఎల్ అండ్ టీ సంస్థ ఎందుకు ఒక గొప్ప ఐటీ కంపెనీని ఏర్పాటు చేయలేకపోతోందని వారు ప్రశ్నించారు. తమ కంపెనీని నాశనం చేయడం ఎందుకని వారు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో 20,000కు పైగా ఉద్యోగులు కూడా ఈ ఒప్పందంపై సంతోషంగా లేరన్న వారు సంకేతాలు ఇచ్చారు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా కేవలం 1.81 శాతం ప్రీమియం ధరపై పెద్ద సంతోషంగా లేవు. ఒక వేళ రూ.980 ధరను పెంచితే వారు సంతుష్ట పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మైండ్ ట్రీలో 66 శాతం వాటాను బలవంతంగా కొనుగోలు చేయడం కోసం రూ.10,800 కోట్లను ఎల్ అండ్ టీ ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మైండ్ ట్రీ సంస్థలో కేఫ్ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థకి చెందిన 20.32 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఇంజినీరింగ్ దిగ్గజ సంస్థ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇక 15% వాటాను బహిరంగ విపణిలోబీ 31 శాతం వాటాను ఓపెన్ ఆఫర్ ద్వారాను సొంతం చేసుకోనే దిశగా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. 20 ఏళ్లకు పైగా కష్టపడి దీనిని నిర్మించుకున్నాం. మా కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా వాటాదార్ల విలువను నాశనం చేస్తున్నారు. ఈ విషయం మీకు తెలుస్తోందా?. ఇది సరైన పద్ధతేనా? ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ.1183గా ఉండే.. వాళ్లు రూ.980కే కొనాలనుకుంటున్నారు. అక్కడే మీ లావాదేవీ విలువ ప్రతిబింబిస్తోంది.. దీనిని మీరు గమనించాలని వారు ఎల్ అండ్ టీ సంస్థను కోరారు. కొంత మంది ప్రమోటర్లు నిష్క్రమించాలని భావిస్తున్నారన్న ఎ.ఎమ్. నాయక్ వ్యాఖ్యలపై స్పందిస్తూ 'అది పూర్తిగా అబద్ధమని ప్రమోటర్లు పేర్కొన్నారు. యాజమాన్య బృందం మొత్తం కంపెనీకి మద్దతు పలుకుతోంద'న్నారు. అయితే మైండ్ ట్రీ ప్రమోటర్లు ఆఫర్ చేసే బైబ్యాక్ ధర కంటే ఎక్కువ ఎల్ అండ్ టీ ప్రకటించి.. వారిని ఆకట్టుకునే ప్రయత్నమూ చేయవచ్చన్న వార్తలు కూడా వస్తున్నాయి.
ఆఖరి అవకాశము చేజిరినట్టే..
ఎల్ అండ్ టీ బలవంతపు టేకోవర్ను నిలవరించేందుకు గాను 'బైబ్యాక్ లేదా ఓపెన్ ఆఫర్ అంశాన్ని బుధవారం బోర్డు పరిశీలించాలని భావించింది. అయితే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల మేరకు ఓపెన్ ఆఫర్ అమలులో ఉన్న తరుణంలో షేర్ల బైబ్యాక్ చేసేందుకు అవకాశం లేదని తేల్చి చెప్పింది. దీంతో మైండ్ట్రీ సంస్థను ఎల్ అండ్ టీ సంస్థ వశం కాకుండా కాపాడేందుకు ప్రమోటర్ల వద్ద ఉన్న ఏకైక ఆయుధం కూడా చేజారినట్టయింది. దీంతో త్వరలోనే ఆ సంస్థ ఎల్ అండ్ టీలో విలీనం కావడం ఖాయంగా కనిపిస్తోంది.