Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యర్థి బలహీనతతో పుంజుకొనే యత్నం
న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ బలహీన పరిస్థితులను బలంగా చేసుకొని ఎదగాలని స్పైస్జెట్ సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జెట్ సంస్థకు చెందిన మేటి సిబ్బందితో పాటు ఆ సంస్థ లీజుకు తీసుకున్న విమానాలను కూడా సొంతం చేసుకొని వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని ఆ సంస్థ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జెట్ సంస్థ గత మూడు నెలలుగా సిబ్బందికి జీతాలు ఇవ్వట్లేదు. దీంతో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సిబ్బంది సంస్థను వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వందల మంది 'జెట్' పైలట్లు.. బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్జెట్లో ఇంటర్వ్యూలకు హాజరైనట్లు తెలుస్తోంది. బోయింగ్ విమానాలు నడిపిన అనుభవం ఉన్న దాదాపు 260 మంది పైలట్లు స్పైస్జెట్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 150 మంది కెప్టెన్లు కూడా ఉన్నారని సమాచారం. వీరంతా బుధవారం ఇంటర్వ్యూలకు హాజరైనట్లు సమాచారం. మరో విమానయాన సంస్థ ఇండిగోకు కూడా పలువురు 'జెట్' సిబ్బంది దరఖాస్తు చేసుకుంటున్నారని సమాచారం. లీజు చెల్లించలేక ఇప్పటికే అనేక విమానాలను సంస్థ నిలిపివేసింది. జెట్ ఎయిర్వేస్కు మొత్తంగా 119 విమానాలుండగా.. వీటిలో మూడోవంతు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. ఒకవేళ సంస్థ మూతపడితే 23,000 మంది సిబ్బంది తమ ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఇప్పటికే జీతాలు లేక సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు జెట్ ఎయిర్వేస్ నిలిపివేసిన బోయింగ్ విమానాలను లీజుకు తీసుకోవాలని స్పైస్జెట్ భావిస్తోందట.