Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎస్యూల వాటాలపై మంత్రి జైట్లీ
- 2018-19లో రూ.85వేల కోట్ల డిజిన్వెస్ట్మెంట్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుకున్న లక్ష్యానికి మించి వాటాలను విక్రయించామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2018-19)లో రూ.85,000 కోట్ల డిజిన్వెస్ట్మెంట్ చేశామన్నారు. ఈ సమయంలో రూ.80వేల కోట్ల వాటాలు విక్రయించాలని తొలత లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇంతకంటే రూ.5 కోట్ల ఎక్కువ డిజిన్వెస్ట్మెంట్ చేశామని జైట్లీ ట్వీట్ చేశారు. తాజాగా ఆర్ఈసీ-పీఎఫ్సీ ఒప్పందంలో రూ.14,500 కోట్ల రెవెన్యూ వచ్చిందన్నారు. అదే విధంగా సీపీఎస్ఈ ఈటీఎఫ్ల ఐదో దశలో రూ.9,500 కోట్ల వాటాలను విక్రయించింది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.90,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని గత నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మోడీ సర్కార్ నిర్దేశించుకుంది. దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న పీఎస్యూల్లో ఇలాగే వాటాలను విక్రయిస్తూ పోతే చివరికి వీటిల్లోని మెజారిటీ వాటా కార్పొరేట్ల చేతికి చిక్కనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా లాభాలు గడిస్తున్న, కేంద్రానికి పెద్ద మొత్తంలో డివిడెండ్లు అందిస్తున్న పలు నవరత్న కంపెనీలనూ కూడా కేంద్రం కనిక రించకుండా వాటా లను విక్రయిం చడం దేశ ఆర్ధిక వ్యవస్థకే ప్రమాద కరమని హెచ్చరి స్తున్నారు. పేరుకు ముందు చౌకిదారు అని పెట్టుకుని.. ప్రభుత్వ రంగ సంస్థలను చౌకగా విక్రయించడమేమిటనీ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
పీఎఫ్సీకి ఆర్ఈసీ వాటా..
ప్రభుత్వ రంగ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేసన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)లో కేంద్రానికి ఉన్న 52.63 శాతం వాటాను మరో పీఎస్యూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్సీ) స్వాధీనం చేసుకుంది. రూ.10 విలువ చేసే రూ.103.94 కోట్ల షేర్లను సొంతం చేసుకున్నట్లు శుక్రవారం పీఎఫ్సీ వెల్లడించింది. ఇందుకోసం రూ.14,500 కోట్లు చెలించింది. దీంతో ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ ఖజానాలోకి చేరింది. ఇది తమ సంస్థకు ముఖ్య మైలురాయి అని పీఎఫ్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
దీంతో ఆర్ఈసీలో ప్రధాన ప్రమోటర్గా కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఆర్ఈసీలోని 52.63 శాతం వాటాను పీఎఫ్సీకి విక్రయించడానికి 2018 డిసెంబర్లో కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రతీ షేర్కు రూ.139.50 చొప్పున చెల్లించడానికి మార్చి 19న జరిగిన వాటాదారులు, బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపినట్లు పీఎఫ్సీ తెలిపింది. మార్చి 28న ఈ లావాదేవీలు పూర్తి కానున్నాయని పేర్కొంది. ఈ స్వాధీనం ద్వారా విద్యుత్ కంపెనీలకు మరింత సౌలభ్యమైన రుణాలు అందడానికి వీలుందని అభిప్రాయపడింది. శుక్రవారం బీఎస్ఈలో పీఎఫ్సీ షేర్ 0.70 శాతం తగ్గి రూ.113.20 వద్ద ముగిసింది.