Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పీఎస్ఈ' నిర్వచనాన్నే మార్చయనున్న ప్రభుత్వం..
- 51% దిగువకు సర్కారు వాటాను చేర్చే యత్నం
- ఇప్పటికే ఆర్థికశాఖతో క్లుప్తంగా చర్చించిన డీపీఈ
- కొత్తసర్కారు రాగానే ఈ దిశగా అధికారిక ప్రకటన
- బ్యాంకుల్లోనూ వాటా విక్రయానికి వీలుగా మార్పులు!
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: పాడి ఆవుల్లాంటి ''ప్రభుత్వ రంగ సంస్థ''ల్లో (పీఎస్ఈ) వాటాల విక్రయం ద్వారా వీలైనంత గరిష్టంగా నిధులను సమీకరించాలని కేంద్ర సర్కారు యోచిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ''ప్రభుత్వ రంగ సంస్థ'' (పీఎస్ఈ) అనే పదానికి నిర్వచనాన్నే మార్చేయాలని భావిస్తోందని సమాచారం. ఇప్పటి వరకు పీఎస్ఈ సంస్థ అంటే సదరు సంస్థలో కనీసం 51 శాతం మేర వాటా ప్రభుత్వం చేతుల్లో ఉండాలన్న నిబంధన ఉంది. తాజాగా సర్కారు దీనిని సవరించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక సంస్థను పీఎస్ఈ సంస ్థఅనడానికి కచ్చితంగా 51% మేర వాటా ఉండాల్సిన అవసరం లేదని.. అంతకంటే తక్కువగా సర్కారు వాటా ఉన్నా ఆయా పీఎస్ఈలు ప్రభుత్వ రంగ సంస్థలుగానే కొనసాగించేలా నిబంధనలను తేవాలని సర్కారు భావిస్తోంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖతో చర్చలు జరిపామని.. దీనికి సంబంధించి త్వరలో అధికారంలోకి రానున్న కొత్త సర్కారు ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. సర్కారుకు చెందిన వ్యూహాత్మకేతర పీఎస్ఈ సంస్థల్లో ప్రభుత్వ వాటాను 40 శాతానికి గానీ లేదా 26 శాతానికి గానీ తగ్గించినప్పటికీ ఆయా సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలుగానే కొనసాగించాలన్నది సర్కారు ఆలోచనగా తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా ఆయా సంస్థల్లో మరింత వాటాను డిజిన్వెష్ట్మెంట్ ప్రక్రియ ద్వారా విక్రయించి సొమ్ము చేసుకోవచ్చన్నది సర్కారు ఆలోచనగా తెలుస్తోంది. దీంతో ఖజానాకు అదనపు ఆదాయం వస్తుందన్న సర్కారు వర్గాల ఆలోచన. జీఎస్టీతో సహా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పడిపోతున్న వేళ ద్రవ్యలోటు మరింతగా పెరిగిపోతున్న నేపథ్యంలో తమ ఖర్చులను ఎదుర్కొనేందుకు గాను సర్కారు ఈ దిశగా ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ వాటాను తగ్గించుకోవడం వల్ల ఆయా సంస్థల బోర్డుల్లోకి ఇతరులు వచ్చి చేరి సమర్థమంతమైన నిర్ణయాలు తీసుకొనేందుకు వీలుపడుతుందన్న వాదనను ప్రభుత్వ వర్గాలు తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిర్వచనం ప్రకారం సీపీఎస్ఈ అంటే కేంద్ర ప్రభుత్వం లేదా మరే దైన సీపీఎస్ఈ సంస్థకు ఒక సంస్థలో 51 శాతానికి తగ్గకుండా ప్రభుత్వ వాటా ఉండాలి. తాజాగా దీనిని కనీసం 40 శాతానికి తగ్గించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ వాటా అత్యధికంగా ఉన్న ఎన్టీపీసీ, పవర్గ్రిడ్; బీహెచ్ఈఎల్ తదితర సంస్థలో వాటా ఎక్కువగా వాటా విక్రయానికి వీలు కలుగ నుంది. తాజా నిర్ణయం వల్ల మరిన్ని సంస్థలను ఏకీకృతం చేసేందుకు కూడా వీలు కుదరనుంది.
పీఎఫ్సీతో ట్రాయల్
తాజాగా ఆర్ఈసీ సంస్థలో మొత్తం ప్రభుత్వ వాటాను పవర్ ఫైనా న్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆర్ఈసీని పీఎఫ్సీలో విలీనం చేయాలని భావిస్తున్నారు. దీంతో విలీనం తరువాత ఏర్పడే సంస్థలో ప్రభుత్వం వాటా 42 నుంచి 43 శాతం దరిదాపుల్లోకి చేరనుంది. ప్రభుత్వం రంగ సంస్థల్లో సర్కారు వాటా విక్రయంతో ఆయా సంస్థల బోర్డుల్లోకి వివిధ సంస్థల నుంచి కొత్తవారు వచి చేరేందుకు కూడా వెసులుబాటు లభిస్తుందని.. దీంతో ఆయా సంస్థలను ప్రగతి పథంలో ముందుకు తీసుకుపోయేందుకు వీలు పడుతుందని సర్కారు వర్గాల వారు వివరణనిస్తున్నారు.
బ్యాంకులే లక్ష్యంగా మార్పులా..!
ప్రభుత్వ సంస్థల (పీఎస్యూ) నిర్వచనం మార్చడం ద్వారా ప్రధానంగా ప్రభుత్వ బ్యాంకుల్లో సర్కారుకు అత్యధికంగా ఉన్న వాటాలను విక్రయించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయా సంస్థల్లో ఉన్న వాటాను 52 శాతానికి కుదించాలని సర్కారు భావిస్తోంది. ఆ తరువాత క్రమంగా దీనిని మరింత తగ్గించుకోవాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా బ్యాంకుల్లో ఎన్పీఏలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో వాటాలను తగ్గించుకోవడం వల్ల రెండు విధాలా లాభం కలుగుతుందన్నది సర్కారు ఆలోచనగా తెలుస్తోంది. పీఎస్యూలలో స్టాక్ మార్కెట్ల రూపంలో ప్రజల వాటాను మరింతగా పెంచడం ద్వారా సర్కారు వాటా తగ్గించుకుంటే మేలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి నిర్ధేశించుకున్న మొత్తం కంటే అత్యధికంగా ప్రభుత్వం దాదాపు రూ.80,000 కోట్ల మేర పెట్టుబడుల ఉపసంహరణను జరిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా దాదాపు రూ.90,000 కోట్ల మేర డిజిన్వెష్ట్మెంట్ జరపాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ లక్ష్యాన్ని అందుకొనే క్రమంలోనే సర్కారు తాజా చర్యలకు దిగుతున్నట్టుగా సమాచారం. పీఎస్యూ నిర్వచనం మార్చడం వల్ల ఫైనాన్షియల్ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ షేర్ల బైబ్యాక్ ద్వారా వాటాల కొనుగోలు చేయించేందుకు సర్కారు వీలుకుదరనుందని.. అతే మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ప్రిమియంతో సర్కారు వాటాలను విక్రయించేందుకు వీలు పడుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు.