Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరిలో 0.1 శాతానికే పరిమితం
- 20 నెలల కనిష్టానికి చేరిన సూచీ..
- తయారీ రంగంపై ప్రభావం
- పెరిగిన సీపీఐ ద్రవ్యోల్బణ సూచీ..
న్యూఢిల్లీ: తయారీ రంగంలో మందగమన పరిస్థితుల కారణంగా గత ఫిబ్రవరి మాసంలో దేశంలోని పారిశ్రామికోత్పత్తి 20 నెలల కనిష్టానికి చేరి 0.1 శాతంగా నమోదు అయింది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్వో) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) అంతకు ముందు 2018 ఫిబ్రవరి మాసంలో 6.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే ఇది ఈ ఏడాదికి 0.1 శాతానికే పరిమితం కావడం విశేషం. ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 4 శాతంగా నమోదు అయింది. ఇది అంతకు ముందు ఏడాది 4.3 శాతం దరిదాపుల్లో ఉంది. ఇదే సమయంలో గత నవంబరు మాసంలో 0.3 శాతంగా ఉన్న ఐఐపీ వృద్ధిని తాజాగా సీఎస్వో కుదించి 0.2 శాతంగా ప్రకటించింది. దానికి ముందు గత జూన్ మాసంలో ఐఐపీ అత్యల్పంగా 0.3 శాతంగా నమోదు అయింది. ఐఐపీలో 77.63 శాతం వాటా కలిగి ఉండే తయారీ రంగంలో వృద్ధి 0.3 శాతంగా నమోదు అయింది. దీంతో మొత్తంగా ఐఐపీపై తీవ్ర ఒత్తిడి నమోదు అయింది. అంతకు ముందు ఫిబ్రవరి మాసంలో తయారీ రంగంలో 8.4 శాతం వృద్ధి నమోదు అయింది. ఇదే సమయంలో యంత్రపరికరాల రంగం 8.8 శాతం మేర కుంగింది. అంతకుముందు ఏడాది ఈ రంగంలో వృద్ధి 16.6 శాతంగా నమోదు అయింది. ఫిబ్రవరి మాసంలో విద్యుత్తు రంగపు వృద్ధి 4.5 శాతం నుంచి 1.2 శాతానికి కుంగింది. మైనింగ్ రంగంలో కొంత మెరుగైన పరిస్థితి కనిపించింది. ఈ రంగంలో వృద్ధి 2 శాతంగా నమోదు అయింది. అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో మైనింగ్ రంగ వృద్ధి 0.4 శాతంగా ఉంది. వాడకం ప్రాతిపదిక గత ఏడాది ఫిబ్రవరితో ఈ ఏడాది ఫిబ్రవరి వృద్ధిని రంగాల వారీగా విశ్లేషించి చూస్తే ఆశ్చర్యకర గణాంకాలు కనిపించాయి. ప్రాథమిక వస్తువుల విభాగంలో 1.2 శాతం వృద్ధి, మధ్యశ్రేణి వస్తువుల విభాగంలో మైనస్ 4.9 శాతం వృద్ధి, మౌలిక, నిర్మాణ రంగ వస్తువుల విభాగంలో 2.4 శాతం వృద్ధి కనిపించింది. మన్నికైన వస్తువులు, వినయోగంలో ఎక్కువగా మన్నికలేని వస్తువుల విభాగంలో వరుసగా 1.2 శాతం, 4.3 శాతం మేర వృద్ధి నమోదు అయింది.
పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
గత మార్చి నెలల రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 2.86 శాతంగా నమోదు అయింది. అంతకు ముందు ఫిబ్రవరి మాసంలో ఇది 2.57 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణంలో స్వల్ప పెరుగుదల కనిపించినప్పటికీ అది ఆర్బీఐ నిర్ధేశించిన పరిమితుల్లోనే ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ ఈ ఏడాది ఫిబ్రవరిలో 2.57 శాతంగా నమోదు అయింది. గత ఏడాది ఇదే సమయంలో 4.28 శాతంగా ఉంది. దీంతో వరసగా ఎనిమిదో నెలలోనే ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్ధేశిత 4 శాతం లోపు నమోదు కావడం విశేషం. అంతకు ముందు గత ఏడాది జులైలో వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీల 4.17 శాతంగా నమోదు అయింది. మార్చి మాసంలో ఆహర ద్రవ్యోల్బణంలో 0.3 శాతం మేర పెరిగింది. అంతకుముందు ఈ విభాగంలో మైనస్ 0.66 శాతం మేర ప్రతి వృద్ధి కనిపించింది. మార్చిలో ఇంధనం, విద్యుత్తు రంగంలో ద్రవ్యోల్బణం 1.24 శాతం నుంచి 2.24 శాతానికి చేరుకుంది. మార్చి మాసంలో కూరగాయలు, పండ్ల ధరలు తగ్గడం విశేషం. తృణ ధాన్యాలు, వాటి సంబంధిత ఉత్పత్తుల ధరల కూడా 1.32 శాతం నుంచి 1.25 శాతానికి దిగి రావడం విశేషం.