Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణ సాయం అందించని రుణదాతలు
- రుణమిచ్చేందుకు బ్యాంకుల వెనుకడుగు..
- తడిచి మోపెడవుతున్న నిర్వహణ ఖర్చు
- మరిన్ని అంతర్జాతీయ సర్వీసులు రద్దు..
- ఎయిర్వేస్ మూసివేసే దిశగా అడుగులు
- ఆదుకొనేందుకు రంగంలోకి మళ్లీ 'గోయల్'
- వాటా కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణ
- పోటీలో మరో నాలుగు సంస్థలు కూడా
- రేపే రుణదాతలతో సంస్థ కీలక భేటీ..
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశీయ విమానయాన రంగ దిగ్గజంగా వెలుగొందిన జెట్ ఎయిర్వేస్ సంస్థ భవితవ్యం నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రుణ భారానికి తోడు, నిర్వహణ నిధులు లేక రోజురోజుకు మరింతగా నీరిసించిపోతున్న సంస్థను ఆదుకొనేలా రుణ దాతలు వేగంగా చర్యలు చేపట్టకపోవడంతో సంస్థ పరిస్థితి మరింత విషమంగా తయారైంది. సంస్థ చైర్మెన్, వ్యవస్థాపక సభ్యుడైన్ నరేష్ గోయల్తో చర్చించి జెట్ ఎయిర్వేస్ పునర్ నిర్మాణ ప్రణాళికను రూపొందించిన రుణదాతలు దానిని అములో చేయడంలో విఫలమవుతున్నారు. ఈ ప్రణాళిక ప్రకారం గోయల్ తన స్థానం నుంచి వైదొలిగిన వెంటనే జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు తిరిగి మొదలుపెట్టేందుకు గాను రుణదాతల బృందం విమాన సంస్థకు దాదాపు రూ.1500 కోట్ల మేర మధ్యంతర ఆర్థికసాయాన్ని అందించాల్సి ఉంది. అయితే రుణదాతల బృందంలో ఈ విషయమై ఏకాభిప్రాయం కుదరటం లేదని సమాచారం. ఇప్పటికే నిరసించి ఉన్న జెట్ ఎయిర్వేస్ సంస్థకు మరిన్ని నిధులను ఇచ్చేందుకు బ్యాంకులు భయపడుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో సంస్థ రోజువారీ నిర్వహణకు డబ్బులు కరువై.. జెట్ ఎయిర్వేస్ మరిన్ని విమాన సర్వీసులను రద్దు చేసుకోవాల్సి వస్తోంది. తొలుత జాతీయ మార్గాల్లోనే సర్వీసులను రద్దు చేసిన జెట్ ఎయిర్వేస్ సంస్థ.. తాజాగా అంతర్జాతీయ మార్గాల్లో సైతం విమానాలను రద్దు చేస్తూ వస్తోంది. దీనికి తోడు ఉద్యోగులకు పని లేకుండా జీతాలివ్వాల్సిన పరిస్థితి నెలకొంది.ఫలితంగా జెట్ నిర్వహణ ఖర్చు తడిచి మోపెడవుతోంది. రుణదాతల సాయంలో జాప్యం కావడంతో సంస్థను మళ్లీ పట్టాలెక్కించేందుకు గాను ఇప్పుడు దాదాపు రూ.2,500 కోట్ల మేర సొమ్ము అవసరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని జెట్ ఎయిర్వేస్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో జెట్ ఎయిర్వేస్కు రుణదాతల బృందం అందిస్తామన్న సాయం పెంచాలని విమానయాన సంస్థ కోరుతోంది. దీనిపై చర్చించేందుకు గాను సోమవారం జెట్ ఎయిర్వేస్ అధికారులు రుణదాతల బృందంతో కీలక చర్చలు నిర్వహించనున్నారు. జెట్లో వాటా విక్రయానికి గాను బ్యాంకులు చేపట్టిన వాటా విక్రయం ప్రక్రియ మరింత జాప్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో ఈ సమావేశం సంస్థ మనుగడకు చాలా కీలకం కానుంది.
మళ్లీ రంగంలోకి దిగిన 'గో'యెల్..
జెట్ ఎయిర్వేస్ సంస్థ దాదాపు మూతపడే దశకు చేరుకోవడంతో ఆ సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మెన్ నరేశ్ గోయెల్ సంస్థను నిలబెట్టేందుకు మళ్లీ ముందుకు వచ్చారు. రుణ దాతలు అమ్మకానికి పెట్టిన సంస్థ వాటాను కొనుగోలు చేసేందుకు గాను ఆయన శుక్రవారం ఆసక్తి వ్యక్తికరణ పత్రాన్ని (ఈవోఐ) దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈవోఐ దాఖలునకు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో.. చివరి క్షణాల్లో గోయెల్ ఈవోఐని దాఖలు చేసినట్టుగా సమాచారం. రుణదాతల బృందానికి నాయకత్వం వహిస్తున్న ఎస్బీఐ ఈ సమాచారాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అయితే సంస్థలో కీలక వాటాను కొనుగోలుకు గాను అబుదాబీ కేంద్రంగా పని చేస్తున్న ఎతిహాద్ ఎయిర్వేస్ సంస్థ కూడా ఈవోఐని దాఖలు చేసింది. ప్రస్తుతం సంస్థకు జెట్ ఎయిర్వేస్లో 24శాతం వాటా ఉంది.. దీనిని 49 శాతానికి చేర్చాలని యాజమాన్యం భావిస్తోంది. ఎతిహాద్కు తోడుగా ప్రయివేటు ఈక్విటీ ఫండ్ సంస్థలు టీపీజీ క్యాపిటల్, నేషనల్ ఇన్ఫ్రా ఇన్వెష్ట్మెంట్ ఫండ్లు కూడా ఈవోఐని దాఖలు చేశాయి. అయితే ఈవోఐల పరిశీలన జరిపి బిడ్ల ప్రక్రియను ముగించేందుకు గాను దాదాపు నెలరోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ లోపు సంస్థను ఆదుకొనేందుకు గాను రుణదాతల బృందం సాయానికి ముందుకు రాకపోతే మాత్రం మరికొన్ని రోజుల్లోనే జెట్ ఎయిర్వేస్ సంస్థ భవితవ్యం చరిత్రపుటలకే పరిమితం కానుంది.