Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2031 నాటికి మన దేశంలో ఈ కల సాకారం
- మేటి వృద్ధిరేటు, పట్టణీకరణతో ఇది సాధ్యమే..
- మూడేండ్లలో 15% మందే పేదరికంలో:
- ఫేస్బుక్ వేదికగా ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల వేళ మోడీ సర్కారు ప్రజలను పక్కదోవ పట్టించేందుకు వీలైన అన్ని మార్గాలను ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఫేస్బుక్లో ఒక ఆకర్షణీయమైన పోస్ట్ ఉంచారు. 2031 నాటికి దేశంలో పూర్తిగా పేదరికమనేదే లేకుండా పోతుందంటూ జోస్యం చెప్పారు. భారత్లో మెరుగైన వృద్ధిరేటు నమోదు అవుతండడంతో పాటు వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో 2021 నాటికి దేశంలో కటిక పేదల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని.. అక్కడి నుంచి దశాబ్ద కాలంలో దేశంలో కటిక పేదరికం పూర్తిగా తుడిచిపెట్టుకుపోగలదని ఆయన అన్నారు. గత జనాభా లెక్కలు సేకరించే సమయానికి దేశంలోని 21 శాతం మంది ప్రజలు రోజుకు 1.90 (రూ.100) డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నట్టుగా ప్రపంచ బ్యాంక్ గణాంకాలు వెల్లడించాయని ఆయన అన్నారు. రానున్న మూడేండ్ల కాలంలో దేశంలో పేదరికం 15 శాతం దిగువకు చేరుకుంటుందని.. అక్కడి నుంచి మరో పదేండ్ల కాలంలో గరీబోళ్ల సంఖ్య అతి కనిష్ట స్థాయికి చేరుకుంటుందంటూ ఆయన వివరించారు. పట్టణీకరణ కారణంగా రానున్న రోజుల్లో దేశంలో మధ్యతరగతి ప్రజల విస్తృతి బాగా పెరిగిపోతుందని.. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలు పలు రెట్లు అభివృద్ధి చెందుతుందని ఆయన ఫేస్బుక్లో చేసిన పోస్టులో విశ్లేషించారు. ఫలితంగా దేశంలో పలు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. గడిచిన మూడు దశాబ్దాల అనుభవాన్ని అనుసరించి ఆర్థిక వ్యవస్థ సరళీకరణ మూలంగా ప్రతి ఒక్క పౌరుడు లబ్ధి పొందినట్టుగా తెలుస్తోందని జైట్లీ అన్నారు. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి కారనంగా రాష్ట్రాలు చాలినంత ఆదాయాన్ని ఆర్జించ గలిగాయని దీంతో ఆయా రాష్ట్రాలు రానున్న రోజుల్లో పేదరిక నిర్మూలనకు పై మరింత దృష్టి సారించే విలుంటుందని ఆయన అన్నారు. దీనికి తోడు రాష్ట్రాలు కొత్త ఉద్యోగాల కల్పన, ఆరోగ్య సంరక్షణ, విద్య తదితర అంశాలపై దృష్టి సారించే విలుందని ఆయన తెలిపారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నప్పుడే భారత్ ఆర్థిక సమస్యలను అధిగమించగలదని ఆయన అన్నారు. జమ్ము కాశ్మీర్, ఉగ్రవాదం దేశానికి ప్రధాన సవాళ్లు అని ఆయన అన్నారు. జమ్ముకాశ్మీర్ మన సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతకు సంబంధించిన అంశమని ఆయన వివరించారు. ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ పేదల కోసం కనీస ఆదాయ పథకంను ప్రకటించిన నేపథ్యంలో.. దానిని దీటుగా ఎదుర్కొనేందుకు ప్రజల ఆలోచన తీరును దారి మళ్లించేందుకు గాను జైట్లీ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.