Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మధ్యంతర సాయం'పై కుదరని ఏకాభిప్రాయం
- బ్యాంకుల నుంచి లభించని ఆర్థిక భరోసా..
- మరిన్ని అంతర్జాతీయ సర్వీసులు రద్దు..
- 20,000 మంది ఉద్యోగుల భవిత ప్రశ్నార్థకం
- భవిష్యత్తు కార్యాచరణపై నేడు బోర్డు సమావేశం
- భద్రత కోరుతూ రోడ్డెక్కిన సంస్థ ఉద్యోగులు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలో అతిపెద్ద ప్రయివేటు రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ దాదాపు మూసివేత దశకు చేరుకుంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఆ సంస్థకు మరింతగా రణం మధ్యంతరంగా అందించేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఆధ్వర్యంలోని రుణదాతల బృందం మరోమారు విముఖత వ్యక్తం చేసింది. మధ్యంతర సాయం విషయమై జెట్ ఎయిర్వేస్ ప్రతినిధులు.. రుణదాతల బృందంతో సోమవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జెట్కు మరింత ఆర్థిక సాయం అందిచలేమని రుణదాతల బృందంలో కొందరు బ్యాంకర్లు తేల్చి చెప్పారు. దీంతో సంస్థ కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. జెట్ ఎయిర్వేస్ను తిరగి నిలబెట్టేందుకు గాను ఎస్బీఐ నేతృత్వంలోని రుణదాతల బృందం గత మార్చి 25వ తేదీని రుణపరిష్కార ప్రణాళికను రూపొందించింది. దీని ప్రకారం సంస్థలో ప్రధాన వాటా కొనుగోలు జరిగే వరకు రుణదాతల బృందం దాదాపు రూ.1500 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు హామీ ఇచ్చింది. ఇందుకు గాను సంస్థ చైర్మెన్ నరేశ్ గోయల్, ఆయన బార్య అనితలు సంస్థలో తమ వాటాను 25 శాతం కంటే తగ్గించుకోవాలని కోరింది. ఈ ప్రణాళిక ప్రకారం గోయల్ తన పదవి నుంచి తప్పుకోవడంతో పాటు తన వాటా ను తగ్గించుకొనే ప్రతిపాదనకు సమ్మతి తెలిపారు. అయితే సంస్థ నిర్వహణను చేతుల్లోకి తీసుకున్న రుణదాత బృందం ఆ తరువాత మధ్యంతర సాయం అందించే విషయంలో వెనుక అడుగు వేస్తూ వస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈ విషయమై జెట్ యాజమాన్యం రుణదాతల బృందంతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తాజాగా సోమవారం చర్చలు కూడా విఫలం కావడంతో జెట్ ఎయిర్వేస్ పరిస్థితి మరింత విషమంగా తయారైంది. ఈ నేపథ్యంలో సంస్థలో పని చేస్తున్న దాదాపు 20,000 మంది ఉద్యోగుల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు గాను జెట్ బోర్డు మంగళవారం అత్యవసరంగా సమావేశం కానుందని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వినరుదూబే తెలిపారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సర్వీసుల రద్దును ఈ నెల 19వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.
20,000 మంది ఉద్యోగులను ఆదుకోండి..
ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న జెట్ ఎయిర్వేస్కు తగిన సాయం ఆందించి ఆదుకోవాలని ఆసంస్థ ఉద్యోగులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విన్నవించుకున్నారు. ఈ మేరకు పైలట్ల సంఘం 'ఏవియేటర్స్ గిల్డ్' మీడియాకు ఒక లేఖను విడుదల చేసింది. సంస్థలోని పైలట్లు, ఇంజినీర్లు, గ్రౌండ్స్టాఫ్తో కలుపుకొని దాదాపు 20,000 మంది ఉద్యోగలు జెట్పై ఆధారపడి జీవిస్తున్నారని వారు తెలిపారు. ఇందుకు గాను జెట్ ఎయిర్వేస్ బాధ్యతలను భుజాన వేసుకున్న ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం తాను ప్రతిపాదించిన రుణ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వెంటనే రూ.1500 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని వారు కోరారు.''సంస్థ కార్యకలాపాలు కొనసాగాలంటే తక్షణమే రూ.1500 కోట్లు విడుదల చేయాలని ఎస్బీఐని కోరుతున్నాం. అలాగే సంస్థలోని 20,000 ఉద్యోగాలను కాపాడాలని ప్రధాని మోదీని కూడా అభ్యర్థిస్తున్నాం'' అని నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్(ఎన్ఏజీ) వైస్ ఛైర్మన్ అదిమ్ వలియానీ సోమవారం మీడియా ముందు వాపోయారు. దీనికి సంస్థలోని ఇతర ఉద్యోగులూ సంఘీభావం తెలిపారు. దాదాపు మూడున్నర నెలలుగా జీతాలు అందని పైలట్లు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.