Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఏ మార్గంలోనూ దక్కని ఆర్థిక సాయం..
- బోర్డు మీట్లోనూ లభించని 'భరోసా'
- ఇక తాత్కాలిక మూసివేతే శరణ్యం
- నేడు లేదా రేపు ప్రకటన!
- 23,000 మంది ఉద్యోగులకు కష్టాలే..
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న దేశంలోని అతిపెద్ద ప్రయివేట విమానాశ్రయ సంస్థ జెట్ ఎయిర్వేస్ పరిస్థితి రెక్కలు తెగిన పక్షిలా తయారైంది. సంస్థ రుణదాతల కూటమి.. వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్లు ఎవరికి వారు తమ పతం వీడకపోవడంతో జెట్ ఎయిర్వేస్ సంస్థకు తక్షణ సాయం అందడం మృగ్యంగా మారిపోయింది. జెట్ ఎయిర్వేస్కు మరింతగా రుణం అందించేందుకు గాను సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మెన్ నరేశ్ గోయెల్ తన వాటాను తనఖా పెట్టాలని.. దీనికి తోడు సంస్థకు ఉన్న దాదాపు 10 వరకు సొంత విమానాలను కూడా బ్యాంకుల వద్ద పూచీకత్తగా ఉంచితే మధ్యంతర సాయం అందిస్తామంటూ కొందరు రుణదాతలు ప్రతిపాదించారు. దీనికి గోయల్, యాజమాన్యం అంగీకరించకపోవడంతో జెట్కు మధ్యంతర సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సంస్థ భవితవ్యంపై చర్చించేందుకు మంగళవారం సమావేశమైన జెట్ ఎయిర్వేస్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక టీవీ చానెల్ వార్త కథనం ద్వారా తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్కు మధ్యంతర సాయం అందించేందుకు ఇటు రుణదాతలు గానీ.. ప్రభుత్వం గానీ.. ఇతర ప్రయివేటు సంస్థలుగానీ మందుకు రాలేదు కాబట్టి.. విధిలేని పరిస్థితుల్లో అవసరమైతే సంస్థ కార్యాకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించింది. ఈ విషయమై తుది నిర్ణయాన్ని సంస్థ సీఈవో అప్పగిస్తూ బోర్డు నిర్ణయ తీసుస్తోంది. ఈ నేపథ్యంలో సంస్థ రుణదాతలతో పాటు ఇంధన సరఫరా సంస్థ ఐవోసీ కూడా మంగళవారం నుంచి తాము అరువుపై జెట్కు ఇంధనాన్ని సరఫరా చేయలేమంటూ చేతులెత్తేసింది. దీంతో పరిస్థితి మరింత విషమించడంతో మంగళవారం కేవలం 5 విమానాలను మాత్రమే తిప్పాలని సంస్థ నిర్ణయించుకుంది. ఫలితంగా మార్కెట్లో ఈ స్టాక్ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా జెట్ ఎయిర్వేస్ షేర్ 18 శాతం మేర కుప్పకూలింది. అలాగే సంస్థను గట్టెఎక్కించే నాధుడు ఇంకా వెలుగులోకి రాలేదు. జెట్ ఎయిర్వేస్ వాటాల కొనుగోలుకు దాఖలు చేయాల్సిన గడువును మరోసారి పొడిగించింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు బిడ్డర్లు తమ బిడ్స్ సమర్పించుకోవచ్చని కంపెనీ తాజాగా వెల్లడించింది.
'గో'యల్ వద్దంటూ బెట్టు..
ఆర్థిక సంక్షభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ను నిలిబెట్టేందుకు గాను కీలక వాటాను సొంత చేసుకొనే ప్రయత్నాలు చేసిన ఆ సంస్థ వ్యవస్థాపకులు, మాజీ చైర్మెన్ దాఖలు నరేశ్ గోయల్ చేసిన ప్రయత్నానికి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ఆసక్తి వ్యక్తీకరణను పత్రాన్ని నిలిపివేయాలని రుణదాతల బృందం నిర్ణయించింది. గోయెల్ రేసులో ఉంటే తాము తప్పుకుంటామని మరో భాగస్వామ్య సంస్థ ఎతిహాద్తో పాటు ఆసక్తి వ్యక్తీరణ జరపిన మరో రెండు కంపెనీలు రుణదాతల బృందానికి హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. దీంతో ఆయన బిడ్ను రుణదాతల బృందం పక్కన బెట్టినట్టుగా తెలుస్తోంది. ఇది ఇలా వుంటే సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఈ పరిణామాలను పరిశీలిస్తోందని కేంద్రమంత్రి సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. మధ్యంతర సాయం విషయమై ప్రభుత్వం బ్యాంకులతో బుధవారం చర్చలు జరిపి ఒక పరిష్కారం కనుగొనే అవకాశం ఉంది. జెట్ భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంది. లేదంటే ఈ ఎయిర్వేస్ గత చరిత్రగా మారిపోనుంది.